మాదాపూర్, అక్టోబర్ 9: ఈర్ల చెరువు అభివృద్ధికి కృషి చేస్తూ సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులను చేపడుతున్నామని, చెరువులో కలుషిత నీరు కలువకుండా చేపడుతున్న డ్రైనేజీ వ్యవస్థ మళ్లింపు పనులను త్వరితగతన పూర్తి చేయాలని స్థానిక ఎమెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరవు సందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులలో భాగంగా రూ.7.41 కోట్ల వ్యయంతో నూతనంగా చేపడుతున్న మురుగు నీటి మళ్లింపు కాల్వ నిర్మాణ పనులకు రూ.32 లక్షల వ్యయంతో చేపడుతున్న బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సోమవారం స్థానిక కార్పొరేటర్ వి. పూజిత గౌడ్, మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈర్ల చెరవులో కలుషిత నీరు కలువకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైశాలినగర్ నుంచి ఈర్ల చెరువు అలుగు వరకు డ్రైనేజీ వ్యవస్థ మళ్లింపు కాల్వ నిర్మాణం పనులలో వేగం పెంచాలని అన్నారు. పనులు నాణ్యత ప్రమాణాలతో ఎక్కడా రాజీపడకుండా చేయాలన్నారు. చుట్టు పక్కల కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేక చర్యలు తాసుకోవాలని, ప్రజలకు, చెరువు చుట్టు పక్కల నివసిస్తున్న కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అనంతరం రూ. 32 లక్షల వ్యయంతో ఈర్ల చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. బతుకమ్మ ఘాట్ను బతుకమ్మ పండుగలోపు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డీఈ నళిని, ఏఈ పావని, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలు తదితరులు ఉన్నారు.
కొండాపూర్, అక్టోబర్ 9 : కాలనీ అసోసియేషన్లు అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలో సీడీపీ, ప్రత్యేక నిధులు రూ.40లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న కమ్యూనిటీహాళ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. అభివృద్ధిలో కాలనీ అసోసియేషన్లు భాగస్వాములవ్వాలన్నారు. కమ్యూనిటీహాళ్ల నిర్మాణంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చిన్నపాటి శుభకార్యాలకు చక్కని వేధికలుగా కమ్యూనిటీ హాళ్లను వినియోగించుకోవచ్చన్నారు. కాలనీలు అసోసియేషన్లను ఏర్పాటు చేసుకుని అభివృద్ధిలో సహకరించాలన్నారు. చందానగర్లోని శివాజీనగర్, జవహర్నగర్, ఇందిరానగర్లలో కమ్యూనిటీహాళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
మియాపూర్, అక్టోబర్9 : ప్రజా సౌకర్యమే ధ్యేయంగా కృషి చేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డామని వారి సంపూర్ణ ఆశీర్వాదాలు తమ వెంటే ఉంటాయని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. రాబోయే రోజులలో మరిన్ని అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో రూ. 10 లక్షల సీడీపీ నిధులతో చేపట్టనున్న దోభీఘాట్ పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్తో కలిసి విప్ గాంధీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ నేతలు, కాలనీ ప్రతినిధులు, మహిళా నేతలు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, ఆక్టోబర్ 9: లింగంపల్లిలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సేవలందిస్తున్నామని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం ఉదయం శేరిలింగంపల్లి డివిజన్లో శ్మశానవాటిక అభివృద్ధి, ప్రహరీ నిర్మాణ పనులకు ఆయన స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిసున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారబోయిన రాజుయాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, కృష్ణ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.