మియాపూర్ , డిసెంబరు 23 : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలు ప్రత్యేక అలంకరణలు ఉత్తర ద్వార దర్శనాలతో భక్తులకు ఆధ్యాత్మికతను అందించాయి. వివేకానందనగర్ డివిజన్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజాదికాలంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తం ఉపవాసంతో వైష్ణవారాధనతో ముక్తి మార్గం లభిస్తుందని పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం అత్యంత విశిష్టమైనదని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరిపైనా విష్ణువు అనుగ్రహం కలగాలని ఆయన ఆకాంక్షించారు.
మాదాపూర్, డిసెంబర్ 23: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పా పార్క్లో శనివారం శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
కొండాపూర్, డిసెంబర్ 23 : వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం చందానగర్లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భగవంతుడి దీవెనలు ప్రజలందరిపై ఉంటాయన్నారు. నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలంటూ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.