రెండు నెలల్లో 14 కేసులు నమోదు
యువతీయువకులే అత్యధికం
ఆచూకీ తెలిసినవారిని కుటుంబసభ్యులకు అప్పగింత..
హిమాయత్నగర్, మార్చి 19 : అదృశ్యమైన యువతులు, మహిళలు, యువకులు, వృద్ధుల ఆచూకీ తెలుసుకుని కుటుంబసభ్యులకు అప్పగించడంలో నారాయణగూడ పోలీసులు విశేషంగా కృషిచేస్తున్నారు. యువతుల అదృశ్యం కేసుల్లో చాలా వరకు 18 ఏండ్లు నిండే వరకు వేచి చూసి నచ్చిన వారితో వెళ్లిపోతున్న ఘటనలు అధికంగా ఉంటున్నాయి. ఇందులో వెళ్లిపోయి పెళ్లి చేసుకుని తిరిగొచ్చేవారు కొందరైతే.. వెంట తీసుకెళ్లిన యువకుడి చేతిలో నమ్మి మోసపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నవారు మరికొందరు. ఇలా హిమాయత్నగర్, నారాయణగూడ, కింగ్కోఠి, హైదర్గూడ పీఎస్ పరిధిలలో రెండు నెలల్లో 14 అదృశ్యమైన కేసులు నమోదయ్యాయి. అదృశ్యం కేసుల్లో అధిక శాతం యువతీయువకులే ఉంటున్నారు. కొంతమంది వృద్ధులు సైతం ఇంటి నుంచి బయటకు వెళ్లి మతిమరపుతో అదృశ్యం అవుతున్నారు. అదృశ్యమైన వారి ఆచూకీ కనుకోవడం, వారి ఫొటోలను అన్ని పోలీస్స్టేషన్లకు లుక్ఔట్ నోటీసులను జారీ చేయడం, సమీప ప్రాంతాల్లో గాలించడం వంటి ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. అదృశ్యమైన కేసులను ఛేదించడం పోలీసులకు కత్తి మీద సాముగా మారుతున్నప్పటికీ అదృశ్యమైన యువతుల ఫోన్ నంబర్, ఫేస్బుక్, సీసీఫుటేజీల ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకొని తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. సుమారు 18 నుంచి 25 ఏండ్ల యువతులే అదృశ్యం కావడంతో పోలీసులు ఎక్కువ శాతం సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్నేహితుల దగ్గరికి, కాలేజీకి, ఉద్యోగానికి వెళ్తున్నామని చెప్పి తిరిగి వారం పది రోజుల తరువాత పోలీస్స్టేషల్లో ప్ర త్యేక్షమవడంతో తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. తెలిసి తెలియక, సరైన అవగాహన లేకపోవడంతో యువత ఆకర్షణనే ప్రేమగా నమ్ముతూ గడపదాటి వెళ్లిపోతున్న ట్లు పోలీసుల విచారణలో తెలుస్తున్నది. కుటుంబ కలహాలు, ఇష్టంలేని పెళ్లీలు, ప్రేమపేరుతో, తల్లిదండ్రులు మదలించడం తదితర రకాల కారణాలతో అదృశ్యమైన వారి కేసులు ఎక్కువగా నమోదుఅవుతున్నాయి. ఎదిగే వయస్సులో పిల్లలతో తల్లిదండ్రులు మాట్లడకపోవడం, సమయం కేటాయించక పోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు అడ్మిన్ ఎస్సై డి.కరుణాకర్రెడ్డి తెలిపారు. బాలికలను మభ్యపెట్టి బలవంతంగా తీసుకువెళ్లి మోసగించే వారిపై కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. సాంకేతికంగా అన్ని అవకాశాలు వినియోగించుకుని అదృశ్యమైన వారిని గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నామన్నారు.
తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి..
పిల్లలకు మంచి, చెడులు, లోకం పోకడలను వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. తెలిసితెలియని వయస్సులో యువతీయువకులు చేస్తున్న పొరపాట్లను సవరించుకోకపోతే వారి బంగారు భవిష్యత్ అంధకారం అయ్యేపరిస్థితి ఉంటుంది. పిల్లల దైనందిన కార్యక్రమాలను గమనిస్తూ వారు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక నిఘా పెడుతూ పనిచేస్తున్న ప్రాంతాలు, చదువుతున్న విద్యాసంస్థలకు వెళ్లి తోటి మిత్రులు, ఉపాధ్యాయులను సంప్రదించి పిల్లల విషయాలను తెలుసుకోవాలి. అదృశ్యమైన వారిని గుర్తించి సకాలంలో బాధిత కుటుంబసభ్యులకు అప్పగించడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని కేసుల్లో మంచి పురోగతి సాధిస్తున్నాం. -నారాయణగూడ ఇన్స్పెక్టర్ రమేశ్ కుమార్