ప్రజలను మోసం చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ అన్నారు. సంపదను పెంచి, దాన్ని పేదలకు పంచడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే.. అదానీ సంపదను పెంచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సేల్స్ ప్రమోటర్గా మారాడని విమర్శించారు. ఆదివారం నగర వ్యాప్తంగా పది చోట్ల నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రులతో పాటు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్కుమార్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ,ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, అరెకపూడి గాంధీ, బేతి సుభాష్రెడ్డి, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్ గుప్త, ఎంఎస్.ప్రభాకర్ హాజరై ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ.. కాంగ్రెస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా సాగుతున్న తెలంగాణను, అన్నదమ్ముల్లాంటి సమాజాన్ని పనిచేతకాని బీజేపీ నేతలు మతపరమైన విద్వేషాలతో విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ముషీరాబాద్, ఏప్రిల్ 2: సికింద్రాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం ప్రజలకు నాలుగేళ్లుగా కనిపించకుండా పోయారని, బండిపోతే బండి, కారుపోతే కారు అన్నోడు పత్తా లేడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. నాలుగేళ్లుగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రజల మధ్య ఉండి అభివృద్ధి చేస్తుంటే సికింద్రాబాద్ ఓటర్ల దయతో కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి నియోజకవర్గానికి ఒక్క రూపాయి తేలేకపోయారని విమర్శించారు. బీజేపీ నుంచి గెలిచి కార్పొరేటర్లు ఎక్కడ ఇళ్లు కడితే అక్కడ వాలిపోయి పైసల్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం అడిక్మెట్ కమ్యూనిటీహాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మతాలు, కులాల పేరిట రాజకీయాలు చేసే ఎవరినిపడితే వారిని ఎన్నుకుంటే అభివృద్ధి జరగదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, సరిపడా మంచినీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మంచినీటి కోసం బిందెల ప్రదర్శన, వేసవి కాలం వస్తే కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డ విషయాన్ని కాంగ్రెస్, బీజేపీ వాళ్లు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
అన్ని మతాలను సమానంగా చూస్తూ బీఆర్ఎస్ పార్టీ హనుమాన్ జయంతిని నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలో భారీ ర్యాలీలు నిర్వహించడంతోపాటు, ప్రత్యేక వేదికలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమం దిశగా సాగుతున్న తెలంగాణ సమాజాన్ని మతపరమై విద్వేషాలతో బీజేపీ విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తుందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్కుమార్ ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ యువతను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. చేతగాని సన్నాసులు అభివృద్ధికి అడ్డుపడుతూ సీఎం కేసీఆర్పై లేనిపోని విషప్రచారం చేస్తున్నారని, అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను ప్రజలు దొంగల చేతుల్లో పెట్టవద్దని కోరారు. చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి మూడో సారి కేసీఆర్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. విభేదాలు మరిచి సమష్టిగా పార్టీ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పాత్ర కీలకమైందన్నారు. సీఎం కేసీఆర్ వెన్నంటి ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారని గుర్తు చేశారు. పోరాటాలకు వేదికగా నిలిచిన ముషీరాబాద్ నియోజకవర్గంలో గత నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు విబేధాలు మరిచి పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశం యావత్తు రాష్ట్రం వైపు చూస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఇక్కడి తరహా అభివృద్ధి దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు సాగుతుందన్నారు. నిత్యావసర సరుకుల ధరలను ఆకాశాన్నంటేలా పెంచిన ఘనత బీజేపీకే దక్కిందని మండిపడ్డారు.
ఆత్మీయ సమ్మేళనంలోనిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాయి. తెలంగాణ ఆట పాటలు, నృత్యాలతో కార్యకర్తలు సందడి చేశారు. ఎమ్మెల్యే గోపాల్, దాసోజు శ్రవణ్ మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, కార్మిక నేత రాంబాబు యాదవ్, కట్టెల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నేతలు బి.మనోహర్సింగ్, ముఠా జయసింహా, బి.శ్రీనివాస్రెడ్డి, రూపేందర్, రెబ్బ రామారావు, ముఠా పద్మ, రోషం బాలు పాల్గొన్నారు.
బన్సీలాల్పేట్, ఏప్రిల్ 2: గత 30 ఏండ్లుగా ఇక్కడి ప్రజలు తనను చూస్తున్నారని, ప్రతి రోజు నుదుటిన బొట్టు పెట్టుకుని బయటకు వస్తానని, అలాంటి తనకు కొందరు ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం నేర్పిస్తున్నారని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. శ్రీరాముడు, హనుమంతుడు మనందరికి దేవుళ్లని, కొన్ని పార్టీల వాళ్లు విచిత్రంగా యువతను తప్పుదోవ పట్టించేందుకు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉదయం బన్సీలాల్పేట్లోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించారు. ముందుగా బన్సీలాల్పేట్ కమాన్ వద్ద నుంచి బ్యాండు మేళాలతో, గులాబీరంగు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. కారుపై నుంచి మంత్రి తలసాని ప్రజలకు అభివాదం చేశారు. బీజేఅర్ నగర్ వద్ద అంబేద్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి తలసాని ఎగురవేశారు. బన్సీలాల్పేట్లో జరిగిన అభివృద్ధి పనులపై రూపొందించిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు.
ఈ సందర్భంగగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు ఎంతో దైవభక్తి ఉందని, మన కండ్ల ముందే యాదగిరిగుట్ట ఆలయం ఎంత బాగా అభివృద్ధి చేశారో చూడాలన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న ఆవిష్కరించనున్నామని తెలిపారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రజలందరూ ఐకమత్యంగా కలసి మెలసి ఉంటున్నామని, కొన్ని పార్టీల వాళ్లు మన మధ్య మత, కుల పరమైన చిచ్చుపెట్టే కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు నమ్మవద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 1.30 లక్షల ఉద్యోగాలను ఇచ్చిందని, మరో 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చిన బిజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని సవాలు విసిరారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే హేమలత లక్ష్మీపతి, సనత్నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీబాల్రెడ్డి, బేగంపేట్ కార్పొరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి, రాంగోపాల్పేట్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ డివిజన్ ఇన్చార్జి జీ పవన్కుమార్ గౌడ్, అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, ప్రధాన కార్యదర్శులు ఎం.మహేందర్, ఎస్.రాజేందర్ పాల్గొన్నారు.