మౌమెరె: ఇండొనేషియాలో శనివారం ఉదయం 7.7 రిక్టర్ స్కేల్ తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని వల్ల కనీసం 47 మంది చనిపోయారని, డజను మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పలు భవనాలు, ఇండ్లు కూలిపోవడంతో భూకంప ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొన్నది. ఈస్ట్ నుస టెన్గ్గరా ప్రావిన్స్లోని సిటీ ఆఫ్ ఎండెకు వాయవ్య దిశలో 68 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతం కేంద్రంగా భూకంపం సంభవించిందని అమెరికా భౌగోళిక సర్వే తెలిపింది.
ఫ్లోర్స్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో ఇది ఏర్పడిందని వెల్లడించింది. కొన్ని ప్రకంపనల తర్వాత భూ కంపం సంభవించిందని..తీర ప్రాంతవాసులకు సునామీ హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత ఉపసంహరించినట్టు అధికారులు చెప్పారు. నగెకియో ప్రాంతంలో 2 వేల మంది గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భూకంపం కారణంగా ఎండె రెగెన్సీలో కొండ చరియలు విరిగి పడ్డాయి.