హైదరాబాద్: సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా సెక్రటేరియట్లో (Secretariat) నిర్మించిన ఆలయం, మసీదు, చర్చిని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నల్లపోచ్చ ఆలయ (Nalla Pochamma temple) ప్రారంభ వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హోమం, మహాస్నపనం(తిరుమంజనం), వేద పారాయణం, మహాలక్ష్మీ యాగము, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం చండీయాగం, ప్రాణప్రతిష్ఠాపన హోమం, ధ్వజస్తంభ, యంత్ర, విగ్రహాల ప్రతిష్ఠ, వేదోక్తంగా ప్రాణప్రతిష్ఠ, మూడు ఆలయాల శిఖర కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth Reddy) దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, మధ్యాహ్నం నిర్వహించనున్న పూర్ణాహుతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.