అమీర్పేట్, మే 1 : చిన్న పిల్లలు ఆడుకునేందుకు వీలైన ఆట పరికరాలు, పెద్దలకు ఉపయోగ పడే విధంగా చక్కటి వాకింగ్ ట్రాక్, ఆహ్లాదాన్ని పంచేలా చుట్టూరా పరు చుకున్న పచ్చదనం, ఆకట్టుకునేలా గజబో ని ర్మాణం.. వీటన్నింటితో పాటు సమావేశాలు, ఇతరత్రా కార్యక్రమాల కోసం చక్కటి కన్వెన్షన్ సెంటర్. ఇవన్నీ ఒకే చోట కొలువుదీరాయి. రూ. 2 కోట్ల వ్యయంతో సనత్నగర్ నెహ్రూ పార్కును మల్టీ జనరేషన్ థీమ్ పార్కుగా జీహెచ్ఎంసీ తీర్చిద్దింది. కాగా మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పార్కును ప్రారంభించనున్నారు.
సనత్నగర్ నివాసితుల కోరిక మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవ తీసుకుని దాదాపు నాలుగేండ్ల క్రితం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ మల్టీ జనరేషన్ థీమ్ పార్కునకు శంకుస్థాపన చేశారు. అనంతరం రెండేండ్ల పాటు కొవిడ్ ప్రభావం.. తదనంతర పరిణామాల్లో అభివృద్ధి పనులు మళ్లీ పట్టాలెక్కేలా చేసిన మంత్రి తలసాని సనత్నగర్లో ల్యాండ్మార్క్గా నిలిచే విధంగా ఈ థీమ్ పార్క్ను తీర్చిదిద్దారు.
ఉదయం పూట వాకింగ్ కోసం చక్కటి ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు లక్షలాది నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆట పరికరాలు, ఆకట్టుకునేలా గజబో, రాత్రి వేళల్లో ఆడుకునేందుకు వీలుగా హైమాస్ట్ లైట్లతో కూడిన షటిల్ కోర్టు, పచ్చదనం మధ్య సేదతీరేందుకు వీలుగా సిమెంట్ బెంచీలు, సమావేశాలు జరుపుకునేందుకు చక్కటి కన్వెన్షన్ సెంటర్.. ఇటువంటి అన్ని సౌకర్యాలు ఒకే గ్రౌండ్లో ఉండేలా చూసిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు ఎస్ఆర్టీ నివాసితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.