బేగంపేట్ మే 13: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం బేగంపేట్ ఎస్పీ రోడ్డు హనుమాన్ దేవాలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ పండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. నూతన పాలక మండలి సభ్యులతో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం పాలక మండలి సభ్యులు కృషి చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అనేక దేవాలయాలను ఎంతో అభివృద్ధి చేశామని భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఏర్పాట్లను చేసినట్టు తెలిపారు. బల్కంపేట్, సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయం అమీర్పేట్లోని కనకదుర్గమ్మ దేవాలయం గణేశ్ దేవాలయం ఇలా అనేక దేవాలయాల్లో జరిగిన అభివృద్ధిని వివరించారు. చర్రితలోనే గొప్పగా నిలిచిపోయేలా యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయాన్ని నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, శ్రీనివాస్గౌడ్, శేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.