ప్రతి బస్తీ గులాబీమయం కావాలి
ఘనంగా ఆవిర్భావ ఉత్సవాలు
బస్తీలు, డివిజన్లలో ప్రత్యేక ఏర్పాట్లు
27న ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరుపుకోవాలి
అంబరాన్నంటేలా సంబురాలు: మంత్రి తలసాని శ్రీనివాస్
హెచ్ఐసీసీలో కొనసాగుతున్న ఏర్పాట్లు
సిటీబ్యూరో, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ) : ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా ఎదిగి అభివృద్ధి చేసి చూపెట్టిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఆదర్శ పరిపాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా స్థాయి టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంతో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని డివిజన్లలోని ప్రతి బస్తీ గులాబీమయం కావాలని, పండుగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వేడుకల్లో పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 27న హెచ్ఐసీసీలో నిర్వహించనున్న ప్లీనరీకి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని తెలిపారు.
ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నగేశ్, రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కట్టెల శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గాల ఇన్చార్జిలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
ఆహ్వానితులు మాత్రమే రావాలి : మాగంటి
హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ హెచ్ఐసీసీలో జరిగే ప్రతినిధుల సభకు ఆహ్వానితులు మాత్ర మే రావాలన్నారు. అదే సమయంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు ప్రజలను భాగస్వామ్యం చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను అద్భుతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలి : విప్ గాంధీ
మాదాపూర్, ఏప్రిల్ 20 : సుదూర ప్రాంతాల నుంచి రానున్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను అరెకపూడి గాంధీ బుధవారం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, బాలానగర్ డీసీపీ సందీప్, ఏసీపీ హనుమంతరావు, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్తో కలిసి సభా ప్రాంగణాన్ని, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ నిర్ణీత సమయానికి ముందే ఏర్పాట్లు పూర్తిచేయాలని ఇన్చార్జిలను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలింగ్ యాదగిరి యాదవ్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.