హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నెక్లెస్ రోడ్డు పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన నర్సరీ మేళాను మంత్రి శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన మొక్కలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి మొక్కలను పరిశీలించారు.
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం అనే గొప్ప కార్యక్రమం చేపట్టి ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలను నాటుతున్న విషయాన్ని గుర్తుచేశారు. నేడు మనం మొక్కలను నాటడం వలన భవిష్యత్ తరాలకు మేలు చేసిన వాళ్లమవుతామని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అనేక రకాల మొక్కలు ఒకే చోట లభించే విధంగా గ్రాండ్ నర్సరీ మేళాను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను మంత్రి అభినందించారు.