హైదరాబాద్: ప్రతి బడ్జెట్ తర్వత గ్యాస్ ధరలు (Gas price) పెంచుకుంటూ పోతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav ) ఆగ్రహం వ్యక్తంచేశారు. తాజాగా గ్యాస్ బండపై (Gas Cylinder) మరోసారి రూ.50 భారంమోపడంతో సిలిండర్ ధర రూ.1155కు చేరిందన్నారు. ప్రధాని మోదీ (PM Modi) వచ్చిన తర్వాత గత ఎనిమిదేండ్లలో రూ.745 గ్యాస్ ధర పెరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరుగుతాయన్నారు. పెంచిన ద్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ (BRS) ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Yadav)తోపాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ఉన్నప్పుడు గ్యాస్ ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా మోదీ గ్యాస్ బండకు దండం పెట్టి ఓటు వేయాలని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పడు ఆయన ప్రధాని అయినతర్వాత వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1100 దాటిందన్నారు. కేంద్రం విమాన చార్జీలు తగ్గించిందని, విమానాల్లో పేదలు వెళ్తారా అని ప్రశ్నించారు.
ఏటా బడ్జెట్లో సబ్సిడీ (Subsidy) నిధులను కేంద్రం తగ్గిస్తున్నదని విమర్శించారు. దీంతో గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీకి పాలించే హక్కు లేదని.. వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. పేదల నడ్డి విరిచే ప్రధాని ఎవరికీ అవసరం లేదన్నారు. నిత్యం పెరుగుతున్న ధరలతో పేదల బ్రతుకులు దుర్భరంగా మారాయన్నారు. పెరిగిన ధరలను తగ్గించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో ధర్నాలు, నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. తమకు దేశంలో ఎదురులేదని విర్రవీగుతున్న BJP ప్రభుత్వానికి గద్దె దిగే సమయం ఆసన్నమైందని, ప్రజలు తగి బుద్ది చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని అంటున్న BJP నేతలు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీలు ఏమైనాయని ప్రశ్నించారు. ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామని చెప్పారు ఏమైందని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు ఇచ్చారా? కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టు కోసం ఏమైనా నిధులు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని ౩౩ జిల్లాలు ఉంటే 17 జిల్లాలలో జిల్లాకు ఒకటి చొప్పున తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని, మీకు దైర్యం ఉంటే మిగిలిన 16 జిల్లాలలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర అభివృద్దికి ఒక్క పైసా నిధులు తేలేని BJP నేతలు సీఎం కేసీఆర్ను ఇష్టమొచ్చినట్లుగా విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ సహా పలువురు కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.