మహానగరంలో సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఆ కలను తెలంగాణ ప్రభుత్వం సాకా రం చేస్తున్నది. అర్హులైన పేదలు మరో మూడు రోజుల్లో గృహ ప్రవేశం చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన అధికారులు అర్హులైన వారిని ర్యాండమైజేషన్ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 500 మంది చొప్పున, గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో 12 వేల లబ్ధిదారులకు ఒకే రోజు డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. ఎంపికైన లబ్ధిదారులతో మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వర్చువల్గా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు రాబోతున్నాయనే సమాచారంతో లబ్ధిదారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సొంతింటి కలను సాకారం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ )
సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్రూం ఇండ్లను సెప్టెంబర్ 2వ తేదీన ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఆన్లైన్ డ్రా పద్ధతిలో ఎంపిక చేసిన 12వేల మంది లబ్ధిదారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ కలను నెరవేరబోతున్న సందర్భంగా మంత్రితో మాట్లాడిన బహదూర్పురా, ఆసిఫ్నగర్, సైదాబాద్, యూసుఫ్గూడ, బేగంబజార్, బోరబండ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కల నేరవేర్చాలి.. పేదలు ఆత్మగౌరవంతో గొప్పగా బతకాలనే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు దేశంలో ఎక్కడాలేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించామన్నారు. పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను దరఖాస్తు చేసుకున్న వారికి దశలవారీగా అందజేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండోమైజేషన్ సాఫ్ట్వేర్తో ఆన్లైన్ డ్రా నిర్వహించినట్లు మంత్రి తలసాని వివరించారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గం పరిధిలో 500 మంది చొప్పున 12వేల మందిని ఎంపిక చేశామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన లబ్ధిదారులకు జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీల వద్ద పంపిణీ చేస్తామన్నారు. ఎవరెవరికి ఇండ్లను ఎక్కడ కేటాయిస్తారనే పూర్తి వివరాలను అధికారులు తెలియజేస్తారని మంత్రి లబ్ధిదారులకు వివరించారు.