సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ) : గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని ఆశీర్వదించాలని హైదరాబాద్ నగర ఓటర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలలో జరుగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఎవరు ఊహించని స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని తెలిపారు.
రోడ్ల విస్తరణ, అభివృద్ధి, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం నూతన రోడ్ల నిర్మాణం, అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. అదేవిధంగా గత ప్రభుత్వాల హయాంలో నిరాదరణకు గురైన పార్లను కూడా ఎంతో అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తలసాని పేర్కొన్నారు. తాగునీటి సమస్యను కూడా పరిషరించినట్లు తెలిపారు.
ఇవే కాకుండా వైకుంఠ ధామాల్లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఇవేకాకుండా శాంతిభద్రతల నిర్వహణ, 24 గంటల విద్యుత్, ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తుండటంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి ఐటీ సెక్టార్, పరిశ్రమల ఏర్పాటు జరిగిందని, తద్వారా లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో హైదరాబాద్ నగరం అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకున్నదని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరం గుర్తింపు పొందిందన్నారు. పెన్షన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ కార్యక్రమాల అమలులో సైతం తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. గురువారం జరిగే ఎన్నికలలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఆశీర్వదించాలని కోరారు.