కంటోన్మెంట్, నవంబర్ 15: కంటోన్మెంట్ ప్రజలంతా అభివృద్ధి, సంక్షేమ పథకాల బీఆర్ఎస్నే కోరుకుంటున్నారని కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందితకు భారీ మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నేటి నుంచి మరింత ఉధృతంగా గులాబీ పార్టీ కార్యాచరణ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలే తమ బలం, బలగం అని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్కు దరిదాపుల్లోనూ లేవని ఎద్దేవా చేశారు. బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్లోని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందితతో కలిసి సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. వార్డుల వారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై మంత్రి తలసాని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా 25న సీఎం కేసీఆర్ బహిరంగ సభ, 21న మంత్రి కేటీఆర్ రోడ్ షోలను దిగ్విజయం చేయడానికి అవసరమైన ప్రణాళిక గురించి క్యాడర్కు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ క్లాసిక్ గార్డెన్స్లో గురువారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ బూత్ లెవల్ మీటింగ్ జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. క్యాడర్ అంతా ఉదయం 8 గంటలలోపే సమావేశానికి తరలిరావాలని సూచించారు. క్యాడర్ పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రి కేటీఆర్ రోడ్ షోతో పాటు, సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ ప్రజల గుండెల్లో ఉన్నారని మంత్రి తలసాని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ సహకారంతో కంటోన్మెంట్లోని ప్రతి వార్డులోనూ సాయన్న ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్కు క్యాడర్ లేదని బీఆర్ఎస్కు మాత్రమే వాడవాడలా క్యాడర్ ఉన్నదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కుటుంబసభ్యులందరిపైనా ఉందన్నారు. కంటోన్మెంట్లో నీళ్లిచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, దివంగత ఎమ్మెల్యే సాయన్న సతీమణి గీత, నాయకురాలు నివేదిత, బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.