హైదరాబాద్: దేశ గర్వపడేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా అమీర్పేటలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంతో మంది వీరుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛాయుత భారతావని ఏర్పడిందన్నారు. దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులను స్మరించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు15 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.