మారేడ్పల్లి (హైదరాబాద్) : పోలీంగ్ శాతం పెంచడంలో యువత కీలక పాత్ర పోషించాలని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) పిలుపునిచ్చారు. మోండా డివిజన్లోని ఆదయ్యనగర్ క్రీడ మైదానంలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, యువత సన్మార్గంలో నడవాలని, అప్పుడే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షలాది మంది యువతకు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1. 30 లక్షల ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ(TSPSC) ద్వారా భర్తీ చేసిందన్నారు.
ఐటీ మంత్రి కేటీఆర్(Minister KTR) కృషితో రాష్ట్రంలో ఆయా రంగాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. 2014 లో 3 లక్షల ఉద్యోగాలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 10 లక్షల వరకు పెరిగిందన్నారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలింగ్ శాతం పెంచడంలో యువత పాత్ర ఎంతో కీలకమైందన్నారు.
యువతకు అండగా నిలిచే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపాలని తెలిపారు. ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ పాల్గొన్నారు.