మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
కార్పొరేటర్లు,నాయకులతో సమావేశం
బేగంపేట్ జూన్ 25: దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని దళితులు సద్వినియోగం చేసుకొనేలా చూడాలని సూచించారు. మొదటి విడుతలో సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో 100 మందికి ఆర్థిక సహాయం మంజూరు కాగా వారిలో 28 మందికి పలు రకాల వాహనాలు అందించినట్లు తెలిపారు.
మిగిలిన లబ్ధిదారులకు కూడా వీలైనంత త్వరగా యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండో విడుతలో అర్హులైన వారు త్వరితగతిన దరఖాస్తులను అందజేసేలా చూడాల్సిన బాధ్యత కార్పొరేటర్లపై ఉందని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్లు అత్తెల్లి అరుణగౌడ్, శేషుకుమారి, డివిజన్ నాయకులు శ్రీనివాస్గౌడ్, కొలను బాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.