హైదరాబాద్ : నగరంలోని సనత్ నగర్ జీవై రెడ్డి కంపౌండ్ వద్ద నూతనంగా నిర్మించిన 180 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. లబ్దిదారుల చేత మంత్రులు గృహ ప్రవేశాలు చేయించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఇండ్లు కట్టించి ఇస్తున్నారు. ఆడ బిడ్డల పెళ్లిళ్లు కూడా చేయిస్తున్నారు అని పేర్కొన్నారు. మంచి నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇంటి పన్ను ఏడాదికి రూ. 100 చెల్లిస్తే చాలు అని చెప్పారు. బస్తీ వాసులంతా ఏకతాటిపై నిలిచి కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిరుపేద వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
గతంలో పూర్తిగా బస్తీలుగా ఉన్న గాంధీనగర్, సాయిరాం నగర్లలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టడంతో ఇక్కడి స్థానికులు ఉన్నత ప్రమాణాలతో కలిగిన గృహాల్లో నివసించనున్నారు. కాగా 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూం ఇండ్లలో ఒక లివింగ్ రూం, రెండు బెడ్రూంలు, ఒక కిచెన్ రూ మ్, రెండు టాయిలెట్లు, మూడు లిఫ్టులు, ఆరు షాపులు ఉన్నాయి. ఒక్కొక్కటి రూ.8.65లక్షల వ్యయంతో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు ఉచితంగా కేటాయించనున్నారు. ఈ కాలనీలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, లిఫ్ట్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ, సీసీ రోడ్లు, వీధి దీపాలను ఏర్పాటు చేశారు.