Minister Srinivas Yadav | బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో హోం మంత్రి మహమూద్ అలీ, జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రావణ్తో కలిసి హైదరాబాద్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా సాగుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక నియోజకవర్గాల్లో డివిజన్ స్థాయి సమ్మేళనాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.
మిగతా డివిజన్లలో 24లోగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 25న నిర్వహించే నియోజకవర్గ సమ్మేళనాలకు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఎన్నికల్లో పోటీ చేసిన వారిని, పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతలను ఆహ్వానించాలని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో పార్టీ పతాకాలను ఆవిష్కరించి సమావేశం వద్దకు రావాలని చెప్పారు. సమ్మేళనాల సందర్భంగా జెండాలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలన్నారు. సమావేశం నిర్వహణకు సంబంధించి సమగ్రమైన ఎజెండాను సిద్ధం చేసుకోవాలన్నారు.
ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి పనులను తెలియజేసేలా ప్రగతి నివేదికను రూపొందించి ఆత్మీయ సమ్మేళనంలో వివరించాలన్నారు. సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నగేశ్, రావుల శ్రీధర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జిలు ఆనంద్ గౌడ్, నందు బిలాల్, ఆజాం, సలావుద్దీన్ లోది, రాంరెడ్డి, జీవన్ సింగ్, బక్రీ పాల్గొన్నారు.