Minister Srinivas Yadav | గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ సీవీ ఆనంద్తో కలిసి నిమజ్జనం, శోభాయాత్ర ఏర్పాట్లను మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. చార్మినార్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఉస్మాన్ గంజ్, మోజంజాహీ మార్కెట్, ఆబిడ్స్, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్లో ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేసే క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు.
శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గణేశ్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే అన్ని రహదారులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు అడ్డం లేకుండా తొలగించినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు 52వేల విద్యుత్ లైట్లను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు తాగునీటిని అందించడం 34 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం 122 స్టాల్స్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విగ్రహాల నిమజ్జనం కోసం 125 స్టాండింగ్, 244 మొబైల్ మొత్తం 369 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 37 హెల్త్ క్యాంప్ల ఏర్పాటుతో అత్యవసర వైద్యసేవల కోసం 15 హాస్పిటల్స్లో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
శోభాయాత్ర, నిమజ్జనం జరిగే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసేందుకు 3వేల మంది పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా చూసే 68 అడుగుల ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం 74 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని, అలాగే 33 బేబీ పాండ్స్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 200 మంది స్విమ్మర్లు, 5 బోట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమొద్దని సూచించారు.