హైదరాబాద్ : రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) అన్నారు. బుధవారం బంజారాహిల్స్లోని ఆదివాసి భవన్లో నిర్వహించిన ఆదివాసి దినోత్సవ వేడుకలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక కొత్త అంశంతో ఆదివాసి దినోత్సవాన్ని యువతకు ప్రేరణ కలిగించేలా నిర్వహిస్తున్నామని అన్నారు.
గిరిజన తండాలను గ్రామ పంచాతీయలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ (CM KCR) కే దక్కుతుందని అన్నారు. అందరికీ విద్య అందించాలనే సంకల్పంతో గిరిజన పాఠశాలలను, కళాశాలలను నెలకొల్పారని వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 7 యూనివర్సిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాలైన ములుగు, మహబూబాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం ప్రాంతాలలో కూడా మెడికల్ కాలేజీ (Medical Colleges)ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు వైద్య విద్య అందుబాటులోకి వచ్చిందని ఆమె తెలిపారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయక రాష్ట్ర ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శంకర్నాయక్, బానోత్ హరిప్రియ నాయక్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.