చర్లపల్లి, ఫిబ్రవరి 14 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. చర్లపల్లి డివిజన్ చక్రీపురం చౌరస్తాలో సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన భోగ్ బండార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు బంజారాల పట్ల అపారమైన గౌరవం ఉందని, ప్రభుత్వం సంత్ సేవాలాల్ జయంతికి ప్రత్యేక నిధిని కేటాయించి అధికారికంగా నిర్వహిస్తుందని ఆమె గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, బీఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఏఎస్రావునగర్, చిలుకానగర్ డివిజన్ల కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్రెడ్డి, బన్నాల గీత ప్రవీణ్, మేడ్చల్ లంబాడి ఐక్యవేదిక అధ్యక్షుడు ధీరావత్ హనుమంత్నాయక్, రాష్ట్ర నాయకుడు రాజ్కుమార్ జాదవ్, తదితరులు పాల్గొన్నారు.