కందుకూరు, ఏప్రిల్ 11 : కాలుష్యం లేని ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించాలని చూస్తే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ముచ్చర్ల గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. ఎకరాకు 121గజాల ఇంటి స్థలం చొప్పున ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఇండ్ల స్థలంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఫార్మాసిటీపై బేజేపీ, కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారంలో అర్థం లేదన్నారు. ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు ఇచ్చిందని, ఫార్మాను వ్యతిరేకించే బీజేపీ నాయకులు చైతనైతే సెంట్రల్కు వెళ్లి ఆపుకోవాలని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే ఫార్మాసిటీ ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఫార్మాసిటీ చుట్టూ బఫర్ జోన్ ఉండదని ఈ విషయంలో బ్రోకర్ల మాటలు నమ్మవద్దని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు అమ్ముకోవద్దని కోరారు. అదే విధంగా ముచ్చర్ల గ్రామంలో వడ్డెర సంఘం భవనానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, స్థానిక సర్పంచ్ ఇంజమూరి రాంచంద్రరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మాదేవేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్రెడ్డి, ఏజీ అంజయ్యగౌడ్, కాకి దశరథ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, ఈశ్వర్గౌడ్, సర్పంచులు కాసుల రామకృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, ప్రవీణ్నాయక్, నరేందర్గౌడ్, ఎంపీటీసీలు మల్లేశ్, ఇందిరమ్మ, రాములు, రైతు విభాగం అధ్యక్షుడు సొలిపేట అమరేందర్రెడ్డి, యూత్ నాయకులు కొలను విజ్ఞేశ్వర్రెడ్డి, తాళ్ల కార్తిక్, దీక్షిత్రెడ్డి, రవి, దేశం మోహన్రెడ్డి, డైరెక్టర్లు వెంకట్రాంరెడ్డి, ఆనంద్, సామ ప్రకాశ్రెడ్డి, పారిజాతం, కొండల్రెడ్డి, మాజీ సర్పంచులు నర్సింహ, రాములు, గోవర్ధన్, జంగయ్య, బాబయ్య, ఆర్డీఓ సూరజ్కుమార్, తాసీల్దార్ మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.