మహేశ్వరం, నవంబర్ 16: రాష్ట్రంలో మంచినీటి దాహాన్ని తీర్చిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని, దళిత బంధు ప్రపంచంలో ఎక్కడా లేదని, ఒక్క తెలంగాణలోనే అమలు జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలోని నాగారం, నందుపల్లి, తీగలకుంట, ఏనుగు చెరువు తండా, పడమటి తండా, ఏనె మీది తండా, నాగిరెడ్డిపల్లి, హబీబుల్లాగూడ, గొల్లూరు, అమీర్పేట, తూప్రఖుర్ధు, పెద్దమ్మ తండ, నల్లచెరువు తండ, మాణిక్యమ్మ గూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి గురువారం నిర్వహించారు. మొదట నాగారం గ్రామంలో అమరుడు సిరిపురం యాదయ్య సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం, మంత్రికి బతుకమ్మలు, మంగళహారతులు, భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజక వర్గానికి ఇష్టం లేక వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని బీఆర్ఎస్ బలగం నామరూపాలు లేకుండా చేయాలన్నారు. మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులకు, రియల్ సేవకురాలికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ప్రజలే న్యాయనిర్ణేతలని ఆమె తెలిపారు. ఎల్లప్పుడు ప్రజాసేవ చేస్తున్న నియోజక వర్గం ఆడబిడ్డగా నన్ను దీవించి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు.