బడంగ్పేట్, సెప్టెంబర్ 15 : డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా, ఎవరి జోక్యంలేకుండా ఇండ్లను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసీ సహకారంతో ర్యాండమైజేషన్ సాఫ్ట్వేర్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో రూపొందించిన ప్రక్రియ ద్వారా కేటాయింపులు చేపడితే బీజేపీ నేతలకు నమ్మకం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నివర్గాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పారు. గృహలక్ష్మి పథకం ద్వారా అర్హులైన వారికి రూ.3 లక్షలు అందజేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు. టెట్ ప్రశాంతంగా ముగిసిందని, త్వరలోనే ఫలితాలు వెలువడనున్నట్లు పేర్కొన్నారు.