కందుకూరు/మహేశ్వరం, అక్టోబర్ 8 : కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఒక ప్రత్యేక విజన్తో మహేశ్వరం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఆదివారం మహేశ్వరం మండల పరిధిలోని తుమ్ములూరు, గంగారం, రామచంద్రగూడ, కోళ్లపడకల్, కల్వకోల్, పెండ్యాల, దుబ్బచెర్ల, పోరండ్ల గ్రామాలలో రూ.16 కోట్ల 36 లక్షలతో వివిధ అభివృద్ధి పనులను జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో ప్రారంభించారు. తుమ్ములూరులో బతుకమ్మ కుంట వద్ద జడ్పీ నిధులతో ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు. కందుకూరు మండల పరిధిలోని సార్లరావులపల్లి తండాలో రూ.2.50కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనం, ఫంక్షన్ హల్ను సర్పంచ్ రజిత ప్రవీణ్నాయక్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ అధికారంలోకి వస్తే 3గంటల విద్యుత్ ఇస్తానని చెపుతున్నాడని, మీకు 3గంటలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా, లేక 24గంటలు ఉచితంగా ఇచ్చే సీఎం కేసీఆర్ ప్రభుత్వం కావాలా అని ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రూ.200 ఇచ్చిందని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,116వేలు ఇస్తున్నారని తెలిపారు. తాగునీటి సమస్యను తీర్చాం, ఎరువుల సమస్య లేకుండా చేశాం, వైద్య రంగంలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపామని, ఇంత సక్కగున్న తెలంగాణను తప్పిపోయి కాంగ్రెస్ చేతిలో పెడితే మళ్లీ మొదటికి వస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్పై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉన్నదని చెప్పారు. ఢిల్లీ పార్టీలు మన రాష్ర్టానికి అవసరమా.? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ అడ్డా అని.., మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాం
అన్ని రంగాల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లను కల్పించినట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. గిరిజనుల ఆత్మగౌరవం కోసం బంజారాహిల్స్లో గిరిజన భవనం నిర్మించామని చెప్పారు. 500 జనాభా ఉన్న ప్రతి తండాను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, మార్కెట్ యార్డు చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, వైఎస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి దశరధ ముదిరాజ్, చిర్ర సాయిలు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, రైతు విభాగం అధ్యక్షుడు సోలిపేట అమరేందర్రెడ్డి, మేఘనాథ్రెడ్డి, ఎంపీటీసీలు మల్లేశ్, కాకి రాములు, తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, మాజీ సర్పంచ్ గోవర్ధన్ నాయక్, నర్సింహ, బాలు, సర్పంచ్లు మంద సాయిలు, శేఖర్ గుప్తా, కుమార్, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్రెడ్డి, మాజీ డైరెక్టరు పారిజాతం, రాము, పాండు, శ్రీనివాస్రెడ్డి, ప్రశాంత్చారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.