సిటీబ్యూరో, జనవరి18 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లో రోజూ 2 గంటలు.. కరెంట్ కోతలు అంటూ వచ్చిన వార్తలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. వేసవిలో అధిక డిమాండ్ నేపథ్యంలో భాగంగానే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు సీఎండీతో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో సమస్యపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అధికారులు మరమ్మతు పనుల షెడ్యూల్ను రూపొందించారని తెలిపారు.
జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు 15 నిమిషాల నుంచి 2 గంటల లోపు నిర్వహణ పనులు పూర్తి చేసేలా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. రెండు గంటలకు మించి కరెంట్ పోతే అధికారులకు మెమోలు తప్పవని తెలిపారు. ఈ నిర్వహణ పనులు గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని వివిధ సబ్ స్టేషన్ల పరిధిలో రొటేషన్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జంటనగరాల్లో 11 కేవీ సామర్థ్యం కలిగిన 2400 ఫీడర్లున్నాయని.. ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్లలో మరమ్మతులు చేపట్టే వారని.. ఎన్నికల కారణంగా జనవరిలో మరమ్మతులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతిరోజు 100 ఫీడర్స్ పరిధిలో కేవలం రెండు గంటల లోపు మాత్రమే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.