బడంగ్పేట, మే 13 : ప్రణాళికాబద్ధంగా మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20,21,23,28,31,32 డివిజన్లలో రూ.9.10కోట్ల అభివృద్ధి పనులకు ఆదివారం మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు కార్పొరేషన్ నిధులతో పాటు ప్రభుత్వ ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేయిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గం పరిధిలోని రెండు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో నాలుగు చోట్ల రూ.18.50కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. తుక్కుగూడ, జల్పల్లి, బడంగ్పేట, మీర్పేటలో సమీకృత మార్కెట్ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు అన్ని ఒకే చోట అన్ని సరుకులు, కూరగాయలు, మాంసం లభించే విధంగా మార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కో మార్కెట్ నిర్మాణానికి రూ.4కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. వైకుంఠ ధామాల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. చివరి మజిలీలో ఎవరు ఇబ్బందులు పడకూడదని మోడ్రన్ వైకుంఠధామాలు నిర్మాణం చేయిస్తున్నామన్నారు.
పేదల వద్దకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయిస్తుందని మంత్రి అన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లు, వంద పడకల దవాఖానలను నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడా నీటి సమస్యలు రాకుండా ఉండటానికి మిషన్ భగీరథ ద్వారా రిజర్వాయర్లు, పైపులైన్ ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్లో మంచి నీటి సమస్య ఉత్పన్నం కాకండా ఉండటానికి ప్రతి ఇంటికి మంచి నీటి కనెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. వేసవి కాలంలో కూడా నీటి సమస్యలు రాకుండా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డీఈ అశోక్ రెడ్డి, జ్యోతి రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గోన్నారు.