కంటోన్మెంట్, ఏప్రిల్ 21 : రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, కేంద్రం ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఒకటో వార్డు బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. వారి హయాంలో మంత్రులుగా ఉన్నవారు కనీసం తాగునీరు కూడా అందించలేకపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులు.. వారి ప్రభుత్వాల హయాంలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. కేంద్రం ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్లో తాగునీటిని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కేసీఆర్కు విశ్వాసం ఉంటే.. మోదీ వద్ద మోసం ఉందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేకూరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, నళినికిరణ్, నేతలు టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, ప్రవీణ్యాదవ్, రాజుసింగ్, ప్రభుగుప్త, పూర్ణచంద్రారెడ్డి, సికిందర్, మార్కెట్ డైరెక్టర్లు సుషాంత్రెడ్డి, దేవులపల్లి శ్రీనివాస్, భాస్కర్ ముదిరాజ్, సదానంద్గౌడ్, మురళీయాదవ్, నర్సింహా, పద్మ, అసీన్ ఖాన్, విజయ్, శ్రీధర్, సురేశ్, సోమయ్య, తేజ్పాల్ పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా..ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా అది సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్తోనే సాధ్యం అవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అంతకు ముందు దివంగత ఎమ్మెల్యే సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జి శ్రవణ్, మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బేవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్లతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. అదేవిధంగా గతంలో కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు 15 రోజులకో సారి తాగునీరు సరఫరా జరిగేదని, తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడేవారని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో జీహెచ్ఎంసీలో మాదిరిగానే కంటోన్మెంట్లో కూడా ప్రతిరోజు తాగునీటి సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సాయన్న కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందించినట్లు చెప్పారు. కంటోన్మెంట్ గులాబీ జెండా అడ్డా అని..రానున్న బోర్డు, సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
65 లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఆవిర్భవించిందని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్కుమార్ అన్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధి ఏమిటో, ప్రత్యేక తెలంగాణకు ముందు రాష్ట్రం ఎలా ఉండేదో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలను కలిగి ఉన్న బీఆర్ఎస్.. ఎంతో బలమైన శక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు.
పేదలకు మేలు చేస్తామని, ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగల్బాలు పలికిన ప్రధాని మోదీ తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని రాష్ట్ర బేవరేజెస్, ఖనిజాభివృద్ధి సంస్థల చైర్మన్లు గజ్జెల నాగేశ్, మన్నె క్రిషాంక్లు విమర్శించారు. దేశానికి మోదీ పాలన గుదిబండలా తయారైందని, బీజేపీ సర్కారుకు చరమగీతం పాడటానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచడం ఆనవాయితీగా మారిందని, దేశంలో అదానీ, అంబానీలే కాదు ఆమ్ ఆద్మీలు కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
‘పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్..రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే విజయం..’ అని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోఅన్ని వర్గాల అభ్యన్నతి కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మోదీ దేవుడంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. గ్యాస్ ధరలు పెంచినందుకు దేవుడా అని ప్రశ్నించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలువాలన్నారు.