రంగారెడ్డి, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 203 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వేపల్లి బాటలోనే విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గురుకులాల ఏర్పాటుతో విద్యారంగంలో నూతన శకం ఆవిష్కృతమైందని, ‘మన ఊరు-మన ఒడి’తో ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మారిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, కలెక్టర్ హరీశ్, డీఈవో సుశీందర్రావు, జడ్పీ సీఈవో దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లాలో 64 మంది…
మేడ్చల్, సెప్టెంబర్5 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ను అందించేది ఉపాధ్యాయులేనని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం 64 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 179 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ. 80 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా విద్యాధికారి విజయకుమారి, సీఈవో దేవసహాయం తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ జిల్లాలో 81 మంది
సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయులే దేశాభివృద్ధికి వెన్నుముక అని జిల్లా విద్యాధికారిని ఆర్ రోహిణి అన్నారు. మంగళవారం గురుపూజోత్సవ వేడుకలను నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యా సంస్థలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 81 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ టీచర్ అవార్డులు అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్గౌడ్, డిప్యూటీ విద్యాధికారులు, హెడ్మాస్టర్లతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.