2014 ఎన్నికల్లో 63 సీట్లు.. 2018 ఎన్నికల్లో 85 సీట్లు… ఈ సారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్టు 105 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని.. అంతా బీఆర్ఎస్ పక్షమే అని స్పష్టం చేశారు. రెండో సారి బీఆర్ఎస్ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ ఖరారైన సందర్భంగా నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు.
మేడ్చల్, ఆగస్టు 21 : ‘వచ్చే ఎన్నికల్లో కారుదే గెలుపు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయి.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగింది. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ పగ్గాలు చేపట్టిన ఉద్యమ నేత సీఎం కేసీఆర్.. రాష్ర్టాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేశారు. మిషన్ భగీరథ ద్వారా మహిళల నీటి గోస తీర్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్తో అన్నదాతలకు ధీమా కల్పించారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి.. యువతకు ఉపాధి చూపారు. కుల వృత్తులకు చేయూతనిచ్చారు’.. అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండోసారి మేడ్చల్ టికెట్ ఖరారైన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో ప్రజలకు కరెంట్, కన్నీటి కష్టాలు తప్పా.. చేసేందేమీ లేదన్నారు. ఈ సారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్లు.. 105 నుంచి 110 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమనేది ఉండదని, అంతా బీఆర్ఎస్ పక్షమేనని చెప్పారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
నాపై నమ్మకంతో సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. భారీ మెజార్టీ సాధిస్తా. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా నిత్యం ప్రజల్లో ఉండి సేవ చేస్తున్నా. ఆ గుర్తింపుతోనే మళ్లీ టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధించేందుకు కృషి చేస్తా.
బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ తెలంగాణ అంతటా తిరిగి..ప్రజల బాధలు తెలుసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పరాయి పాలకులు తెలంగాణకు చేసిన అన్యాయంపై పూర్తి అవగాహన ఉంది. అందువల్లే అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్లారు. మిషన్ భగీరథతో మహిళల నీటి బాధలు తీర్చారు. ఆసరా పింఛన్లతో వృద్ధులు, దివ్యాంగుల జీవితాలకు భరోసానిచ్చారు. కుల వృత్తిదారులకు చేయూతనిచ్చారు. పల్లెలు, పట్టణాల్లో నీళ్లు, సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వైకుంఠధామాలు, వీధి దీపాలు తదితర సౌకర్యాలు సమకూరాయి. ప్రకృతి వనాలతో కళకళలాడుతున్నాయి. అందువల్లే 2014 ఎన్నికల కంటే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నది. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్నగర్, దమ్మాయిగూడ, నాగారం, పీర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో అపరిష్కృతంగా ఉన్న వరద నీటి ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం. జవహర్నగర్ డంపింగ్యార్డు దుర్వాసన, కాలుష్య బాధల నుంచి ఉపశమనం కల్పించాం.
సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్నది. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు తరలివచ్చి..బీఆర్ఎస్లో చేరుతున్నారు. దేశ ప్రజలు తెలంగాణ మాడల్ కావాలని కోరుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటి.. కేంద్రంలో కీలకంగా మారుతుంది.
ప్రజలు సీఎం కేసీఆర్ను కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే, 24 గంటల కరెంట్ కావాలంటే సీఎం కేసీఆర్ను మళ్లీ గెలిపించుకుంటేనే సాధ్యమన్న స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. అందులో డౌటే లేదు.
రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షమనేదే ఉండదు. అంతా బీఆర్ఎస్ పక్షమే. ఏ పార్టీకి కూడా డిపాజిట్లు దక్కవు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, ఆసరా పింఛన్ల వంటి పథకాలు ఉన్నాయా? 24 గంటల కరెంట్ అమలవుతున్నదా ? ఇవన్నీ ప్రజలకు తెలియదా? అలాంటప్పుడు ఆ పార్టీలను ఎలా నమ్ముతారు.