మేడ్చల్ రూరల్, జనవరి 25: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్నారని, కంటి వెలుగు కార్యక్రమం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్పూర్ గ్రామంలో బుధవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతి పథకంతో ప్రజలకు లబ్ధి చేకూరుతున్నదన్నారు. వృద్ధులు, అంధత్వ సమస్యలు ఉన్న వారికి ఇబ్బంది కలుగకూడదని చేపట్టిన కంటి వెలుగు వెలుగులు నింపుతున్నదని తెలిపారు. రెండో విడుత చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి పల్లెలో యాగంలాగా నిత్య పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో రూ. 250 కోట్ల నిధులు వెచ్చించి 1500 బృందాలతో శిబిరాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
మేడ్చల్ జోన్ బృందం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ఐదో రోజు బుధవారం అపూర్వ స్పందన లభించింది. బోడుప్పల్, జవహర్నగర్ కార్పొరేషన్లతో పాటు ఏడు మున్సిపాలిటీల్లో 20 కంటి వెలుగు శిబిరాలను 2471 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 638 మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వగా, 461 మందికి కంటి అద్దాలను ఇచ్చేందుకు గుర్తించారు. కాగా 368 మందికి శస్త్ర చికిత్స కోసం గుర్తించారు. మూడుచింతలపల్లిలో కంటి వెలుగు కేంద్రాన్ని జడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సందర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ రవి, నాయకులు జగన్నాథం, వేణుగోపాల్రెడ్డి, వీరేశం, వైద్యాధికారి దమయంతి, వైద్యులు పాల్గొన్నారు.