మేడ్చల్, జూలై18(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీని రైతులు ఛీ కొడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. ఉచిత విద్యుత్పై టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లాల్గడి మలక్పేటలో మంగళవారం రైతు వేదిక సభను రైతులకు మద్దతుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… అమెరికా వెళ్లిన రేవంత్రెడ్డి ఎన్ఆర్ఐల వద్ద ముష్టి ఎత్తుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక పేరిట డబ్బులు దోచుకొని పార్టీని విడిచి పారిపోవడం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ అభ్యర్థులను చీపుర్లతో ప్రజలు కొడతారని మంత్రి అన్నారు. ఎంపీగా ఉండి కూడా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను అభివృద్ధి చేయలేని రేవంత్ రాష్ర్టానికి ఏమీ చేస్తారని ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలు తెలియని ఆయన ఉచిత విద్యుత్పై మతిభ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలబడతారని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి అన్నపూర్ణ తెలంగాణగా తీర్చిదిద్దారని చెప్పారు. వ్యవసాయం రంగంలో దేశంలోనే నంబర్వన్ స్థానానికి తీసుకొచ్చేలా ప్రణాళికలను అమలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవంతం చేసినట్లు మంత్రి వివరించారు. రైతుల కష్టాలను గుర్తించిన కేసీఆర్ సాగుకు కల్పించిన సౌకర్యాలను అందిపుచ్చుకుని పంటలు పండిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కళ్లు మండుతున్నాయన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు పంటలకు నీళ్లు ఇస్తున్నదని, కాంగ్రెస్ వస్తే పొలాలన్నీ బీళ్లుగా మారుతాయని, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ 56 ఏండ్ల పాలనలో రైతులకు చేసిందేమీ లేదని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. దమ్ముంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో 24 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతుబంధు పథకాన్ని అమలు చేయాలని మంత్రి సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చీకటి రోజులు వస్తాయన్నారు. రైతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నాడని, రైతుబంధు పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మేడ్చల్ జిల్లాలో రూ. 440 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. అనంతరం డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూబాయి, జడ్పీటీసీ అనిత, సర్పంచ్ వనజ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ ఇందిరా, మద్దుల శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
24 గంటలు కరెంట్ ఇచ్చి, పంటల సాగుకు పైసలిస్తున్న సీఎం కేసీఆర్ సార్ మా దైవం. గతంలో కరెంట్ , నీళ్లు లేక పంటలు ఎండిపోయి వ్యవసాయమే బంద్ చేసాం. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక నీళ్లు, కరెంట్, ఎరువులు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలిచ్చి.. రైతులకు కష్టాలు లేకుండా చేసిండు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేయాలంటేనే ఎన్నో కష్టాలు ఉండేవి. ఇప్పుడు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు తోడుగా ఉన్నడు.
-మేకల లక్ష్మి, లాల్గడి మలక్పేట
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజు చేసిండు. ఉచిత విద్యుత్ ఇచ్చి, పంట పెట్టుబడి సాయం అందించి అప్పులు లేకుండా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించిండు. రైతు మేలు కోరిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆరే. ఎవరో ఏదో చేస్తామని వచ్చే వారిని రైతులు ఎవరు నమ్మరు. ఇప్పుడు మాటలు చెబుతున్న వారు అప్పుడు ఎందుకు చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు న్యాయం చేసిండు.
-భూంరెడ్డి, శామీర్పేట్
వ్యవసాయాన్ని పండుగ చేసింది ముఖ్యమంత్రి కేసీఆరే. తెలంగాణ రాక మునుపు వ్యవసాయం చేస్తే అప్పులు అయ్యేవి. ఇప్పుడు వ్యవసాయం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతులు రుణపడి ఉంటారు.
-ప్రకాశ్, లాల్గడి మలక్పేట