మేడ్చల్, మార్చి 23(నమస్తే తెలంగాణ): ‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 25 నుంచి జరిగే బీఆర్ఎస్ పార్టీ అత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేస్తాం. వీటి నిర్వహణ జిల్లా ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి దిశానిర్దేశం మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేసుకుంటున్నాం. సమ్మేళనాల నిర్వహణపై బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు’ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వెల్లడించారు. అత్మీయ సమ్మేళనాలపై ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
బీఆర్ఎస్ పార్టీ అత్మీయ సమ్మేళనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నాం. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఈనెల 25 నుంచి వచ్చే నెల 25 వరకు నిర్వహించే విధంగా ప్రణాళికను పార్టీ ఆదేశాల మేరకు సిద్ధం చేసుకున్నాం. అత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ మేరకు సౌకర్యాలను కల్పించనున్నాం. జిల్లా వ్యాప్తంగా అత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేస్తాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఇంటి పార్టీగా ప్రజలందరూ భావిస్తున్నారు. అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలను అందిస్తూ ఆర్థికాభివృద్ధి చెందేలా అనేక పథకాలకు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ను కుటుంబ పెద్దగా అనుకుంటున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ న్యాయం జరుగుతుందంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలందరూ భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా తమ ఇంటి కార్యక్రమంగా భావిస్తూ స్వచ్ఛందంగా ప్రజలు అ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అసలు పోటీయే లేదు. తెలంగాణ ఏర్పడ్డాక ఎనిమిదేండ్లుగా జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ శాశ్వతంగా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటున్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా ప్రజల చూపంతా సీఎం కేసీఆర్ వైపు మళ్లింది. ఇక్కడ అమలవుతున్న పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ దేశంలో చరిత్ర సృష్టించడం ఖాయం.