KTR | హైదరాబాద్ : తెలంగాణతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్న లక్షలాది మంది బిడ్డలకు ఒక కల్పతరువు లాగా, అన్నంపెట్టే అమ్మ లాగా హైదరాబాద్ ఇవాళ అందర్నీ అక్కున చేర్చుకుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తొమ్మిదిన్నరేండ్లు అయింది తెలంగాణ ప్రభుత్వం వచ్చి. ఈ కాలంలో నికరంగా పని చేయగలిగింది ఆరున్నరేండ్లు మాత్రమే. కరోనాతో రెండేండ్లు వృధా అయింది. ఒక సంవత్సర కాలంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఆరున్నరేండ్లలో చేసిన పని తీరు మీ ముందుంది. మా కంటే ముందు ప్రభుత్వాల పని తీరు మీ ముందుంది. హైదరాబాద్ మహానగరం ఇవాళ ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంది. రాష్ట్రం నుంచి, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్న లక్షలాది మంది బిడ్డలకు ఒక కల్పతరువులాగా, అన్నంపెట్టే అమ్మలాగా హైదరాబాద్ ఇవాళ అక్కున చేర్చుకుంది అని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేసీఆర్ ఒక్క మాట స్పష్టంగా చెప్పారు. ఇక్కడ స్థిరపడ్డ ఏ బిడ్డ అయినా, రాయలసీమ, ఆంధ్రా కావొచ్చు, కర్ణాటక, తమిళనాడు కావొచ్చు ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడ్డా.. వాళ్లు మా బిడ్డలే.. మా తెలంగాణ బిడ్డలే.. వారిని కంటికి రెప్పలా చూసుకుంటామని దాదాపు పదేండ్ల కిందనే కేసీఆర్ చెప్పారు. చెప్పిన మాట నిలబెట్టుకుంటూ గత తొమ్మిదిన్నరేండ్లుగా కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు. మతం పేరు మీద మంటలు పెట్టలేదు. ప్రాంతం పేరు మీద పంచాయితీలు అంతకంటే పెట్టలేదు. అభివృద్ధే నా మతం.. సంక్షేమమే నా కులం.. అంటూ పేదవాళ్లను కడుపులో పెట్టుకుకున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్ర సంపదను పెంచుతూ.. పేదలకు పంచుతూ శాంతి భద్రతను పటిష్టంగా మెయింటెన్ చేస్తూ.. అందరూ మవైపు తిరిగి చేసే విధంగా హైదరాబాద్ను కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.