Minister KTR | తెలంగాణలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడోసారి గెలిచి దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. జీవో నెం.118 కింద రెగ్యులరైజ్ చేసిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్నెల్ల పాటు రాజకీయాలు చేస్తే చాలని.. మిగతా నాలుగున్నరేండ్ల పాటు అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు ఏం చేయాలనే దానిపైనే దృష్టి పెట్టాలని అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని, పనికొచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని మంత్రి కేటీఆర్ అన్నారు. వాళ్లు తిరిగి గెలిపించుకుంటారనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఆ నమ్మకంతోనే 415 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పుకొచ్చారు. 24 గంటలూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని సలహానిచ్చారు.
‘ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటుంటారు. ఇల్లు కట్టడం ఎంత కష్టమో.. పెళ్లి చేయడం కూడా అంతే కష్టమనే భావనలో ఈ మాట అంటుంటారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు మేమే కట్టిస్తున్నాం.. పెళ్లి మేమే చేస్తున్నాం.’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్లు లక్ష పూర్తయినయి. ఈ ఇండ్లను ఆగస్టు 15 నుంచి అక్టోబరులోగా పంపిణీ చేయబోతున్నామని ప్రకటించారు. ఇప్పటికే ఇండ్లు పూర్తయినయని.. అలాట్మెంట్ చేసుకుని.. నియోజకవర్గానికి 4వేల చొప్పున ఇండ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. గృహలక్ష్మీ పథకం కింద నియోజకవర్గానికి మూడు వేల కుటుంబాలకు ఇవ్వబోతున్నాని చెప్పారు. ఒక్క ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే డబుల్ బెడ్రూం ఇండ్లు 4 వేలు, గృహలక్ష్మీ పథకం కింద 3వేలు వస్తాయని అన్నారు. జీవో నెం.58, 59 కింద 11వేలు వచ్చాయని, జీవో నెం.118 కింద 18 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. అంటే ఒక్క నియోజకవర్గంలోనే 40 వేల పైచిలుకు కుటుంబాలకు సొంతింటి కల నెరవేరిందని వివరించారు.
సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగతంగా లాభం జరిగే పథకాలు మాత్రమే కాదని.. హైదరాబాద్ విస్తరణను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న 50 నుంచి వందేండ్లలో ఎంత అభివృద్ధి జరిగినా సరే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న 70 కిలోమీటర్ల మెట్రో మార్గం, నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్టు మెట్రో మార్గం 31 కిలోమీటర్లు కాకుండా మరో 314 కిలోమీటర్ల మెట్రో మార్గానికి సీఎం కేసీఆర్ అనుమతిచ్చారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గంలోని నాగోలు నుంచి ఎల్బీనగర్ మార్గాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ మీదుగా ఓఆర్ఆర్ దాకా మెట్రోను తీసుకెళ్తున్నామని.. అదేవిధంగా ఓఆర్ఆర్ చుట్టూ 159 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. ఓఆర్ఆర్ నిర్మించినప్పుడే మెట్రో కోసం స్థలం కేటాయించారు కాబట్టి ఎలాంటి భూసేకరణ పనులు లేకుండా తక్కువ ఖర్చుతోనే ఈ మెట్రో నిర్మాణం చేయొచ్చని అన్నారు.
కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెబితే నమ్మశక్యంగా అనిపించదని.. కేసీఆర్ ఏ ఛాలెంజ్ తీసుకున్నా అలాగే అనిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాధిస్తా అని కేసీఆర్ బయల్దేరిననాడు చాలామంది నమ్మలేదన్నారు. కానీ తెలంగాణ సాధించడమే కాదు.. సాధించిన తెలంగాణను తలసరి ఆదాయంలో భారతదేశంలోనే అగ్రభాగంలో నిలబెట్టారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యంత లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కాళేశ్వరం)ను ఐదేండ్లలో కడతామంటే ఎవరూ నమ్మలేదన్నారు. మనదేశంలో ఒక ప్రాజెక్టు మొదలైందంటే.. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఐదారుగురు ముఖ్యమంత్రులు మారతారు. కానీ ఒక్క ముఖ్యమంత్రి పట్టుబట్టి ఐదేండ్లలో ప్రపంచంలో అతిపెద్దలిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారన్నారు. ‘ ఇంటింటికీ నీళ్లు ఇస్తానని, 70 ఏండ్ల భారతదేశ స్వాతంత్య్రం అనంతం ఎవరూ చేయని పనిచేస్తానని అంటే కూడా ఎవరూ నమ్మలేదు. ఇదేదో ఓట్ల కోసం చెబుతున్నా మాట అన్నారు. కానీ ఆ పని కూడా పూర్తి చేసి రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్’ అని అన్నారు. అపరిష్కృతంగా దశాబ్దాల నుంచి పేరుకుపోయిన నల్లగొండ ఫ్లొరైడ్, పాలమూరులో వలసలు.. ఇలా అన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని అన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నామని తెలిపారు. కరోనా వచ్చిన తర్వాత ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహాలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( టిమ్స్ ) పెట్టి నగరానికి నాలుగువైపులా ఒక్కో చోట 2వేల పడకలతో ఆస్పత్రులను నిర్మిస్తున్నామని చెప్పారు. నిమ్స్లో మరో రెండు వేల పడకలు జత చేసి కొత్తగా 10 వేల పడకలు పేదల సౌలభ్యం కోసం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. భారత దేశంలో ఎక్కడా లేనట్టుగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.