సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : జోరు వానలోనూ కారు జోరు కొనసాగింది. ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్షో ఉత్సాహంగా జరిగింది. కిక్కిరిసిన జనం ఓ వైపు, దంచి కొట్టిన వానలోనూ ప్రచారం నిర్వహించారు.ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా మల్లాపూర్, ఈసీఐఎల్ చౌరస్తాలో రోడ్షోలో పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ సర్కారు అమలు చేసిన పథకాలతో పాటు నగరంలో చేసిన అభివృద్ధిని వివరించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలోని పారిశ్రామికవాడలు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డికి మద్దతుగా మౌలాలి కమాన్, మల్కాజిగిరి ఆనంద్ బాగ్, ఓల్డ్ అల్వాల్ ఐబీ చౌరస్తాలో రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
మల్కాజిగిరికి అండగా ఉంటా..
మల్కాజిగిరి నియోజకవర్గానికి అండగా ఉంటూ.. ఇక్కడి ప్రజలకు మెరుగైన పాలన ఫలాలను అందించే బాధ్యత తానే తీసుకుంటానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వాజ్పేయ్నగర్ వాసులకు ఆర్యూబీ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలోని చెరువులను ఆధునీకరించుకుంటామన్నారు. మౌలాలి కమాన్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అన్ని మతాలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
ఆల్వాల్ చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక.. అల్వాల్ వరకు మెట్రో విస్తరణతోపాటు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విద్యా సంస్థలను నిర్వహిస్తూనే ప్రజలకు మంచి చేయాలనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మర్రి రాజశేఖర్రెడ్డిని ఆదరించాలన్నారు.
అల్వాల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వెయ్యి పడకల హాస్పిటల్ను బొల్లారంలో నిర్మిస్తున్నామన్నారు. మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు ద్రోహం చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఐదేండ్ల పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి, ఏ ఒక్క సమస్యను తమ దృష్టికి తీసుకురాలేకపోయారన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని, బొల్లారం ఆర్యూబీ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత తనదేనని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఈసీఐఎల్ వరకు మెట్రో
ఎన్నికల్లో గెలిచాక ఉప్పల్ నలుమూలాల మెట్రోను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా మల్లాపూర్ వద్ద మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నుంచి మల్లాపూర్, అక్కడి నుంచి ఈసీఐఎల్ వరకు మెట్రోను విస్తరిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో పారిశ్రామికవాడలకు మూడు రోజుల పవర్ హాలీడేలు ఉండేవన్నారు. మల్లాపూర్, చర్లపల్లిలో పరిశ్రమలు మూసివేసిన సందర్భాలు ఉన్నాయన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ సరఫరా చేసుకుంటున్నామని, మూడేండ్లలో 35 ఫ్లైఓవర్లను నిర్మిస్తే… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన రామాంతాపూర్ నారాపల్లి ఫ్లై ఓవర్ ఇప్పటికీ నిర్మాణంలోనే ఉందన్నారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వంతోనే పెట్టుబడులు వస్తున్నాయని, కేసీఆర్ వంటి బలమైన నాయకుడితోనే సాధ్యమవుతున్నదన్నారు. మూసీ సుందరీకరణ పూర్తి చేస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో హబ్సీగూడను మెరుగుపరుస్తామన్నారు. పేదలకు అన్నపూర్ణ, సౌభాగ్య లక్ష్మి, రూ. 400లకే సిలిండర్తో పాటు, మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించి, కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు.
మెరుగైన రవాణే లక్ష్యం
నగరంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఈసీఐఎల్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరించుకోలేకపోయామన్నారు. మరోసారి గెలిచిన తర్వాత ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకు మెట్రో లైన్ పొడిగిస్తామని స్పష్టం చేశారు.
అదేవిధంగా స్థానికంగా ఉన్న చెరువుల సుందరీకరణతోపాటు, మల్లాపూర్, చర్లపల్లి వంటి పారిశ్రామిక వాడలను ఆధునీకరించుకుందామన్నారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు పనిచేస్తుందన్నారు. బండారి లక్ష్మారెడ్డి గెలుపుతో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. రూ. 400కే సిలిండర్, సౌభాగ్య లక్ష్మి, కేసీఆర్ బీమా, రూ. 15 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంపు వంటి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లుగా తెలిపారు.