KTR | హైదరాబాద్ : ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ వారాంతం నుంచి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదురొనేందుకు సమన్వయంతో పని చేయాలని కేటీఆర్ సూచించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న స్పందనను అధికారుల ద్వారా మంత్రి తెలుసుకున్నారు. ఈ సమావేశంలోనే వర్షాలపై కూడా కేటీఆర్ సమీక్షించారు.
పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఎక్కడికక్కడ అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో భోజన సమావేశాలు ఏర్పాటు చేసుకొని, వారి సేవలకు అభినందనలు తెలుపుతూనే, నగర పారిశుద్ధ్యన్ని మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన దిశా నిర్దేశం చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.