హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితంగానే ఇవాళ కండ్లకోయలో ఐటీ పార్కును నిర్మించుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉత్తర హైదరాబాద్కు ఈ ఐటీ పార్కు ఆరంభం, ప్రారంభం మాత్రమే అని మంత్రి తేల్చిచెప్పారు. కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే ఐటీ పార్కుకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
కేసీఆర్ తెలంగాణ కోసం 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు ఆయన వద్ద ఏం లేదు. 14 ఏండ్లు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణను సాధించారు. ఆ ఫలితంగానే ఇవాళ కండ్లకోయలో ఐటీ పార్కును నిర్మించుకోబోతున్నాం. ప్రజల మద్దతు ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఉత్తర హైదరాబాద్లో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్కు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేయడం కంటే.. నార్త్ హైదరాబాద్లోనే ఐటీ ఉద్యోగాలు చేసేలా నగరానికి నలువైపులా ఐటీ పార్కులు నిర్మిస్తున్నాం. ఈ గేట్ వే ఐటీ పార్కు ద్వారా వేలాది మంది పిల్లలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తర హైదరాబాద్కు ఇది ఆరంభం ప్రారంభం మాత్రమే. ఇక్కడ ఐటీని విస్తరించాల్సిన బాధ్యత తమపై ఉంది. ఈ ప్రాంతంలో మంచి యూనివర్సిటీలు ఉన్నాయి. దగ్గర్లోనే ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు ఉన్నాయి. మంచి అర్బన్ పార్కులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్ ఉందని కేటీఆర్ అన్నారు.
గత ఏడున్నరేండ్లలో ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాప్ట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం తెలంగాణలో ఉంది. దీన్ని మూడున్నరేండ్లలోనే పూర్తి చేశారు. కాళేశ్వరం నుంచి గజ్వేల్కు నీళ్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కు మాత్రమే దక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.