నీలగిరి, జూలై 7 : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 13, 14, 15, 16, 17, 18, 19, 3వ వార్డుల్లో పట్టణ ప్రగతి పనుల్లో పాల్గొని ఎల్ఆర్ఎస్ నిధులకు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రిగూడెం, చర్లపల్లి, ఆర్జాలబావి, శేషమ్మగూడెం గ్రామ పంచాయతీలను గత పాలకులు మున్సిపాలిటీలో విలీనం చేసి అభివృద్ధిని మరిచారని విమర్శించారు. గ్రామీణప్రాంతాలుగా ఉన్న వీటిని మోడ్రన్ వార్డులుగా మారుస్తానని అన్నారు. ప్రతి వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ, వీధిలైట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో వంద రూ.కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో రూ.20 కోట్ల నిధులకు ప్రణాళికలు తయారు చేసినట్లు పేర్కొన్నారు. మర్రిగూడ బైపాస్ నుంచి బస్టాండ్ వరకు, ఆసుపత్రి నుంచి కలెక్టరేట్, పానగల్ బైపాస్ నుంచి దేవరకొండ రోడ్డు, సాగర్ రోడ్డు వరకు ఆరు లైన్లు, నాలుగు లైన్ల రోడ్డు పనులు ముమ్మురంగా సాగుతున్నాయని, ఏడాదిన్నరలో పూర్తి చేస్తానని అన్నారు. రెండు నెలల్లో చర్లపల్లి సర్వీస్ రోడ్డు పూర్తి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కొండూరు సత్యనారాయణ, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, ఉట్కూరి వెంకట్రెడ్డి, జెరిపోతుల అశ్వినీభాస్కర్, ఆలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, ఇబ్రహీం, రాధికాయుగంధర్రెడ్డి, తుమ్మల గోవింద్రెడ్డి, కవ్వీ, పేర్ల జానయ్య, ఈఈ శ్రీనివాస్, టీపీఓ నాగిరెడ్డి, డీఈ నర్సింహారెడ్డి, ఏఈ వినోద్, అంగన్వాడీ టీచర్లు ఖుర్షీదా, శంకరమ్మ, ఉషశ్రీ, మెప్మా అధికారి జ్యోతి పాల్గొన్నారు.