అంబర్పేట/మలక్పేట, జూలై 27: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు రానీయమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మంత్రి కేటీఆర్ నగరంలో పర్యటించారు. మలక్పేట, అంబర్పేట ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కాలేరు వెంకటేశ్, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జలమండలి ఎండీ దానకిశోర్తో కలిసి మూసారాంబాగ్ బ్రిడ్జీ వద్ద మూసీ వరద ఉధృతిని పరిశీలించారు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా వరదనీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహించి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతుందని ఎమ్మెల్యే బలాల పరిస్థితిని మంత్రికి వివరించారు.
బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఆగస్టు 15 లోపు మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మంత్రి సానుకూల స్పందనతో ఎమ్మెల్యే బలాల సంతోషం వ్యక్తం చేశారు. వరద ఉధృతి పెరిగితే వాహనాలను దారి మళ్లించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని , ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టే సహాయక కార్యక్రమాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మలక్పేట నియోజకవర్గ ఇన్చార్జి మహ్మద్ ఆజం అలీ, హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనితా నాయక్, వైస్ చైర్మన్ భూమేశ్వర్, డైరెక్టర్లు , మాజీ కార్పొరేటర్ సునరితారెడ్డి, డీసీ మారుతీ దివాకర్, ఏఎంఓహెచ్ జ్యోతిబాయి, తాసీల్దార్ లలిత, కార్పొరేటర్లు లావణ్యశ్రీనివాస్గౌడ్,విజయ్కుమార్గౌడ్,మాజీ కార్పొరేటర్ కె.పద్మావతి డీపీరెడ్డి , నాయకులు అజిత్రెడ్డి, రఘునందన్రెడ్డి, సిద్ధార్థ్ ముదిరాజ్, చంద్రమోహన్ పాల్గొన్నారు.