మహానగరంలో సొంతింటి కలను సాకారం చేసి పేదల గుండెల్లో సర్కారు గూడు కట్టుకున్నది. ఎన్నో ఏండ్లుగా సంపాదనలో సగం ఇంటి కిరాయికే చెల్లించి.. బతుకు బండిని భారంగా కొనసాగిస్తున్న పేదల కుటుంబాల్లో ప్రభుత్వం పండుగ తీసుకొచ్చింది. మార్కెట్లో లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని పైసా ఖర్చు లేకుండా పారదర్శకంగా అందజేసింది. నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ గురువారం ఎంతో అట్టహాసంగా జరిగింది. రెండో విడుతలో భాగంగా మొత్తం 13, 300 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందజేశారు. ఇందులో దుండిగల్లో మంత్రి కేటీఆర్, కొల్లూరు-2లో మంత్రి హరీశ్రావు, చర్లపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ హట్టిగూడలో మంత్రి పట్నం మహేందర్రెడ్డి, తట్టి అన్నారంలో మంత్రి మహమూద్ అలీ, మహేశ్వరంలోని మన్సాన్పల్లిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జవహర్నగర్లో మంత్రి మల్లారెడ్డి, ప్రతాప్ సింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, తిమ్మాయిగూడెంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు.
సిటీబ్యూరో/ మేడ్చల్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : నగరంలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ అట్టహాసంగా సాగింది. గ్రేటర్ వ్యాప్తంగా గురువారం తొమ్మిది ప్రాంతాల్లో జరిగిన ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, నగర మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు పాల్గొని 13,300మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో మంత్రి కేటీఆర్, పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-2లో మంత్రి హరీశ్రావు, చర్లపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ హట్టిగూడలో మంత్రి పట్నం మహేందర్రెడ్డి, తట్టి అన్నారంలో మంత్రి మహమూద్ అలీ, మహేశ్వరం నియోజకవర్గంలోని మన్సాన్పల్లిలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, జవహర్నగర్లో మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని ప్రతాప సింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, తిమ్మాయిగూడెంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి పంపిణీ చేశారు. ఇప్పటివరకు 25వేల ఇండ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగా, మరో 75వేల ఇండ్లను దశల వారీగా అందజేయనున్నారు. అయితే ఇన్నాళ్లు డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట రాజకీయ కుప్పిగంతులు వేసిన ప్రతిపక్షాలకు నోరు లేకుండా పోయిందని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు.
విజన్ ఉన్న నేత కేసీఆర్
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నేతగా, దేశానికే ఆదర్శంగా తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఉచితంగా ఇండ్లను అందజేస్తుందని చెప్పారు.
మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది : మంత్రి తలసాని
సకల సదుపాయాలతో సొంతింటి కలలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ మనసున్న మహారాజుగా నిలుస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. దేశంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ఎక్కడ లేదన్నారు. పారదర్శకంగా ఇండ్ల విధానం చేపట్టామన్నారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని, అందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను గొప్పవారుగా చూడాలని సీఎం కేసీఆర్ చెప్పేవారని, అందులో భాగంగానే విలువైన భూముల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చామన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడంతో పాటు, ప్రజాసంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తామని తెలిపారు. ఇండ్లు పొందిన వారు అమ్ముకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యజ్ఞంలా డబుల్ ఇండ్ల పంపిణీ
అర్హులైన నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుందని తెలిపారు. దశల వారీగా ఇండ్లను కేటాయిస్తామని వెల్లడించారు. మహిళల పేరుపై సొంత స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు అందజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ర్టాభివృద్ధిని చూసి దేశ ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ను బెస్ట్ సీఎం అని కోనియాడుతున్నారన్నారు. జవహర్నగర్ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేశారని అన్నారు. ఇప్పటివరకు రూ.వంద కోట్లు మంజూరు చేసినట్లుగా తెలిపారు. అలాగే డంపింగ్ యార్డులో 5 వందల కోట్ల నిధులతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయిస్తున్న ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందన్నారు.
ఇచ్చిన మాటను నిలుపుకున్నాం
ఎలాంటి పక్షపాతం లేకుండా..
బంగారు తెలంగాణ సాకారమైంది
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. నిరుపేదలకు ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లతో సీఎం కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాకారమైందన్నారు. రూ. 40-50 లక్షలు పలికేలా సర్వాంగ సుందరమైన ఇండ్లను ఉచితంగా పంపిణీ చేసి దేశంలోనే తొలి సీఎంగా కేసీఆర్ నిలిచారని అన్నారు.
పెండ్లి చేస్తున్నాం.. ఇల్లు ఇస్తున్నాం
అర్హులందరికీ విడతల వారీగా ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. మొదటి, రెండో విడతలో ఇండ్లు రాని వారు ఏమాత్రం నిరుత్సాహ పడొద్దన్నారు. అందరికీ పారదర్శకంగా ఇళ్లను అందజేస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. కేసీఆర్ సహకారంతో పేదల పెండ్లి, సొంతింటి ఖర్చులు లేకుండానే కల సాకారం అవుతుందన్నారు.
బీజేపీ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం
ఎలాంటి అవకతవలకు ఆస్కారం లేకుండా రాజకీయాలకతీతంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జరుగుతుందని మంత్రులు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మానవరహితంగా జరుగుతుందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తేలేని బీజేపీ నేతలు విషప్రచారాలతో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
నాడు 60వేలు ఇచ్చినోళ్లు.. నేడు రూ.5 లక్షలు ఇస్తారా..?
గృహ నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామంటున్న కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మొదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇంటి నిర్మాణానికి 60వేలు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం పథకం అనేది నిరంతర ప్రక్రియ అని, పేదలందరికీ ఇండ్లను అందజేసే వరకు ఈ పథకం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇండ్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల సాయాన్ని గృహలక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ స్కీములు.. కాంగ్రెస్ స్కాములు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్కీములు ఉంటే.. కాంగ్రెస్ హయంలో స్కాములు మాత్రమే ఉండేవని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేయని వారు ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని సూచించారు. పేదల బాంధువుడైన కేసీఆర్కు అండగా నిలవాలని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు.
రామలక్ష్మణులు.. శంభీపూర్, వివేకానంద్
దుండిగల్, సెప్టెంబర్ 21 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్లు రామలక్ష్మణుల వంటి వారని మంత్రి కేటీఆర్ అన్నారు. దుండిగల్లో నిర్వహించిన డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎటువంటి పక్షపాతం, మనవ ప్రమేయం లేకుండా ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో జగద్గిరిగుట్టకు చెందిన మహిళా కాంగ్రెస్ నేత, బీజేపీ డివిజన్ అధ్యక్షురాలికి ఇండ్లు దక్కిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి మొదటి నుంచి ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్లు అన్నాదమ్ముల్లా కలిసి మెలిసి కృషి చేస్తున్నారన్నారు. ఇద్దరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద మంచి గుర్తింపు ఉందని, వీరికి ఉజ్వళ భవిష్యత్తు ఉందని తెలిపారు. భవిష్యత్తులోనూ కలిసి, మెలిసి పనిచేయాలని సూచించారు. పనిచేసే నాయకులను ప్రోత్సహించాలని, ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తెలిపారు. ఓఆర్ఆర్ పరిసరాలు అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగర శివారు దుండిగల్లో త్వరలోనే పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు.
లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించాలి
కంటోన్మెంట్, సెప్టెంబర్ 2 : నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు గిఫ్ట్గా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తమదేనన్నారు. నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు చేస్తున్న చిల్లర రాజకీయాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
9 చోట్ల డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ
కుత్బుల్లాపూర్ నియోజవర్గంలో మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి లాస్య నందిత, మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మేడ్చల్ కలెక్టర్ అమోయ్కుమార్ పాల్గొన్నారు.
పటాన్చెరులో మంత్రి హరీశ్రావు
పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో మంత్రి హరీశ్రావు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, దానం నాగేందర్, అరెకపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్రెడ్డి, కలెక్టర్ శరత్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
చర్లపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో మంత్రి మహేందర్రెడ్డి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ హట్టిగూడలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, భూగర్భ గనులశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ చెవుల స్వప్న, రంగారెడ్డిజిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తట్టిఅన్నారంలో హోంమంత్రి మహమూద్అలీ
పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారంలో హోంమంత్రి మహమూద్అలీ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మన్సాన్పల్లిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గంలోని మన్సాన్పల్లిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్ గుప్తా, యెగ్గే మల్లేశం, జిల్లా కలెక్టర్ హరీశ్, తదితరులు పాల్గొన్నారు.
జవహర్నగర్లో మంత్రి మల్లారెడ్డి
జవహర్నగర్లో రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటి మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, జవహర్నగర్ మేయర్ మేకల కావ్య, తదితరులు పాల్గొన్నారు.
ప్రతాపసింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు
మేడ్చల్ నియోజకవర్గం ప్రతాపసింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ ఎమ్మెల్యే వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్లో మేయర్ విజయలక్ష్మి
అబ్ధుల్లాపూర్మెట్ మండలం కుత్బుల్లాపూర్ గ్రామ పంచాయితీ పరిధి తిమ్మాయిగూడెంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కలలో కూడా అనుకోలేదు
25 ఏండ్లుగా కిరాయి ఇండ్లలో ఉన్నాం. చాలీచాలని జీతాలు.. ఇంటి అద్దెకే సగం పోతున్నయి. పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక పోతున్నాం. సీఎం కేసీఆర్ దయతో ఇబ్బందులు తీరుతున్నాయి. ఇళ్లు వచ్చిందని ఫోన్ రాగానే సంబురాలు జరుపుకున్నాం. రెండు బెడ్రూంలు, హాల్, కిచెన్తో ఇంత మంచి ఇల్లు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అన్ని వర్గాలను ఆదుకుంటున్న బీఆర్ఎస్ కలకాలం అధికారంలో ఉండాలి.
– వెన్న మమత, బ్రిడ్జిగల్లీ, అంబర్పేట్
మళ్లీ రావాలే.. కేసీఆర్ సర్కార్
ఎవరి ప్రమేయం లేకుండానే తెలంగాణ సర్కారు దయతో నాకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. సీఎం కేసీఆర్ అన్ని మతాలు, కులాల వాళ్లను సక్కగా చూస్తున్నారు. ఒక్క పైసా తీసుకోకుండా లక్షల రూపాయల ఇండ్లను ఇచ్చి ఆదుకుంటున్న సర్కారు సల్లగా ఉండాలే. సీఎం కేసీఆర్ పాలననే తిరిగి రావాలే.
– అఫ్రిన్ బేగమ్, రామచంద్రగూడ, మహేశ్వరం
ఎందరో దేవుళ్లకుమొక్కుకున్నా కలలో కూడా సొంతింటి కల
నేరవేరుతుందని అనుకోలేదు. సీఎం కేసీఆర్ నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. చిన్న రేకుల ఇంట్లో కిరాయి చెల్లిస్తూ జీవనం సాగించడం కష్టంగా ఉండేది. డబుల్ బెడ్రూం ఇల్లు రావాలని ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నా. ఈ రోజు పట్టా అందడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ నిజంగా దేవుడు. సీఎం కేసీఆర్ సార్కు మా కుటుంబమంతా రుణపడి ఉంటుంది.
– పి.జానకి, నాగయ్యకుంట,ముషీరాబాద్
ఎంతో సంతోషంగా ఉంది
నా భర్తతో విడిపోయి ఇళ్లలో పనిచేసుకుంటూ కొడుకును చదివించుకుంటున్నా. కేసీఆర్ ఇచ్చే దివ్యాంగుల పింఛన్తోనే ఇల్లు నడుస్తున్నది. బస్తీ పెద్దల సూచనలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా. ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఇండ్లు చూస్తుంటే ఇన్నాళ్లు పడిన కష్టాలు మొత్తం మర్చిపోతున్నా. దేవుడిలాంటి కేసీఆర్ దయతో మాలాంటి పేదలందరూ సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలి.
– బత్తుల అరుణ, బీఎస్ మక్తా, సోమాజిగూడ
ఇల్లు వస్తుందని ఊహించలేదు
సుమారు 30ఏళ్ల నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నాం. నాకు ముగ్గురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడుతున్నాం. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం వేలాదిమంది దరఖాస్తు చేస్తుకున్నారు.. మాకు వస్తుందా.. అనుకునే వాళ్లం. బీఆర్ఎస్లో పనిచేసే వాళ్లకే వస్తాయంటూ కొంతమంది అంటుండే వారు. లక్కీడ్రాలో నాకు ఇల్లు రావడంతో వాళ్లతో పాటు మేము కూడా ఆశ్చర్యపోయాం. కేసీఆర్ సార్ చల్లగా ఉండాలి.
– సాబెరాబీ, దత్తానగర్ హిమాయత్నగర్
తండ్రి లెక్కకేసీఆర్ ఆదుకున్నడు
సీఎం కేసీఆర్ పేదలను తండ్రి లెక్క ఆదుకుంటుండు. ఇండ్లలో పని చేసుకుంటూ కిరాయి ఇంట్లో బతికాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు ఇస్తుండు అంటే గంపెడు ఆశతో దరఖాస్తు చేసుకున్న. ఇళ్లు వచ్చిందని ఫోన్ రాగానే.. నమ్మలేకపోయా. ఆ రోజు మా కుటుంబం చెప్పలేనంత సంతోష పడింది. ఇటువంటి సీఎంను నేను ఎప్పుడు చూడలేదు. ఆయనను దేవుడు సల్లంగా సూడాలి.
– లావణ్య, గోల్నాక