KTR | హైదరాబాద్ : హైదరాబాద్ అభివృద్ధి చెన్నై నుంచి రజినీకాంత్కు అర్థమైంది.. కానీ ఇక్కడున్న ప్రతిపక్ష గజినీలకు అర్థమైతలేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నేను 20 ఏండ్ల తర్వాత హైదరాబాద్కు వచ్చాను. హైదరాబాద్ నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్లు, బిల్డింగ్లు చూసి నాకు ఒక్కసారి అనుమానం వచ్చింది. ఇది హైదరాబాదేనా, అమెరికాలోని న్యూయార్కా..? అని చెన్నై నుంచి వచ్చిన రజనీకాంత్ అంటున్నారు. ఇక్కడున్న ప్రతిపక్ష గజినీలకు మాత్రం హైదరాబాద్ అభివృద్ధి అర్థం కావడం లేదని కేటీఆర్ విమర్శించారు.
ఇక్కడున్న వారేమో హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని అంటున్నారు. ఇక్కడ్నుంచి కేపీహెచ్బీ నుంచి బయల్దేరి ఎటువైపు పోయినా మెట్రో, ఫ్లై ఓవర్లు, సవ్యమైన రోడ్లు కనిపిస్తాయి. 24 గంటల కరెంట్, మంచినీళ్లు అందిస్తున్నాం. బ్రహ్మాండమైన వసతులు, అర్ధరాత్రి కూడా ఒంటరిగా వెళ్లే శాంతి భద్రతలు ఉన్నాయి. హైదరాబాద్ ప్రతి ఒక్కరికి ఒక అమ్మలాగా అన్నం పెడుతూ కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం మీ కండ్ల ముందే ఉన్నాయి. ఎవరో వచ్చి ఏదో చెప్తే కన్ఫ్యూజన్ కాకండి. ఆగమాగం కాకుండా, ఆలోచించి ఓటేయండి అని కేటీఆర్ సూచించారు.
హైదరాబాద్లో ఇలా ఉంటేన మన బతుకులు బాగుంటాయి. ఐటీ కంపెనీలు విస్తృతంగా వస్తేనే మన బతుకులు బాగుంటాయి. ఐటీ కంపెనీల్లో వచ్చే ఒక్కో ఉద్యోగం పరోక్షంగా నాలుగు ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఎలా అంటే క్యాబ్ డ్రైవర్లకు, స్విగ్గీ, జోమాటో డెలివరీ బాయ్స్కు, కార్మికులకు అలా పరోక్షంగా వీరందరికీ పని దొరుకుతుంది. తెలంగాణ ఏర్పడిన నాడు ఐటీ ఉద్యోగాలు 3 లక్షల 23 వేలు ఉంటే.. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 10 లక్షల ఉద్యోగాలకు చేరుకుంది ఐటీ రంగం. ఒక వైపు రియల్ ఎస్టేట్ నిర్మారణ రంగం విస్తరిస్తోంది. ఈ రకంగా ఒక్కో రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ముందకు పోతున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.