సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ దవాఖానల్లోని నిమ్స్లో ఇప్పటి వరకు 5కిలోల బరువున్న పిల్లలకు మాత్రమే సర్జరీలు చేసేవారని, ఇక నుంచి గుండెకు రంధ్రం ఉన్న నవజాత శిశువులకు, 2.5 కిలోల అతి తక్కువ బరువున్న శిశువులకు కూడా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. త్వరలోని నిమ్స్కు పక్కనే ఉన్న ఎర్రమంజిల్ కాలనీలో ఉన్న 32ఎకరాల్లో 2000పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిమ్స్కు అనుబంధంగా నిర్మించనున్నట్లు తెలిపారు. రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్, సువెన్ ఫార్మాసూటికల్ సంయుక్త సహకారంతో నిమ్స్లో రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పిడియాట్రిక్ కార్డియో సర్జరీ యూనిట్, 200 ఐసీయూ పడకలు, ఎక్మో, సీఆర్ఆర్టీ తదితరాలను ఆయన ప్రారంభించారు.
నిరుపేదల కోసం నిమ్స్లో అభివృద్ధి పనులకు ఆర్థికంగా సహకరించిన రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్, సువెన్ ఫార్మాసూటికల్ ప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సుమారు రెండు గంటల పాటు నిమ్స్లో కలియదిరిగారు. దవాఖానలోని ఎమర్జెన్సీ బ్లాక్, ట్రామా, ఏఎంసీ, మిలీనియం బ్లాక్, ఫార్మా విభాగంతో పాటు పలు విభాగాలు, వార్డులను పరిశీలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులను పలుకరించి, వారికి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ట్రామా కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ… డాక్టర్లు మంచిగ చూస్తున్నారా..? సౌలత్లు ఎట్లున్నయ్..? మందులు ఇస్తున్నారా..? అని ఆరా తీశారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్, కార్డియో తదితర విభాగాల్లోని దాదాపు 25 మందికి పైగా రోగులను పరామర్శించారు. అనంతరం దవాఖానలోని రికార్డు రూమ్కు వెళ్లి రికార్డులను పరిశీలించారు.
మాతృ మరణాలను అరికట్టేందుకు నిమ్స్లో 200 పడకలతో ఎంసీహెచ్ హాస్పిటల్ను నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇక్కడ మల్టీస్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా హైరిస్క్ గర్భిణులకు నిమ్స్లోనే చికిత్స, ప్రసవాలు చేయడం జరుగుతుందని చెప్పారు. దీని వల్ల ఎంఎంఆర్ రేటు తగ్గుతుందని తెలిపారు. రూ.50కోట్లతో ఈ ఎంసీహెచ్ దవాఖానను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.
ఎమర్జెన్సీ విభాగంలోకి వెళ్లిన మంత్రి హరీశ్రావు అమ్మా ఎలా ఉన్నారు…? ఎక్కడి నుంచి వచ్చారు…? ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారు ? అంటూ రోగులను ప్రశ్నించారు. దాదాపు అందరూ రెండు మూడు రోజులుగా ఉంటున్నట్లు చెప్పడంతో తీవ్రంగా స్పందించిన మంత్రి వెంటనే అధికారులను పిలిపించారు. రోగులు స్టేబుల్ అయిన తరువాత కూడా వారిని ఎమర్జెన్సీలో ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నించారు. ఇలా ఉంచడం వల్లనే ఇక్కడ బెడ్స్ బ్లాక్ అయి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఇతర రోగులకు బెడ్స్ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యవసర విభాగంలో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఆరోగ్యం కుదుట పడిన వారిని వెంటనే సంబంధిత విభాగాల వార్డులను షిఫ్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమర్జెన్సీ వార్డులో ఎప్పటికప్పుడు పడకలు ఖాళీ అయితే ఇతర అత్యవసర రోగులకు పడకలు లభించే అవకాశముంటుందని చెప్పారు. అత్యవసర విభాగం అధికారులకు, ఇతర వైద్య విభాగాల అధికారుల మధ్య సమన్వయం మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, సువెన్ ఫార్మసూటికల్ సీఎండీ వెంకట్ జాస్తి, రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్, అధ్యక్షులు పి.నరేశ్గుప్తా, సెక్రటరీ కళ్యాణ్, నిమ్స్ డైరెక్టర్ డా.మనోహర్, కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డా.అమరేశ్ పాల్గొన్నారు.