Minister Malla Reddy | మేడ్చల్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): దిక్కూ దివానం లేని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు..వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఇరు పార్టీలను నమ్మితే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రద్దు చేసి.. నోట్ల మన్ను వోసి పోతరు. మాయ మాటలతో ప్రజల దగ్గరకు వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను తరిమి తరిమి కొట్టాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపు నిచ్చారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తెలంగాణ రాష్ట్రంలో పుట్టి ఉంటే బాగుండు అని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్కు, రాష్ర్టాభివృద్ధికి ఒక్క రూపాయైన ఇవ్వని బీజేపీ పార్టీకి ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటే ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దరిద్రపు గొట్టు పార్టీలని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ పెద్ద బలగం..
బీఆర్ఎస్ అంటే పెద్ద బలగమని బీఆర్ఎస్ పార్టీలోఉన్న వారందరూ ఆత్మీయంగా ఉంటారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టే సత్తా రాష్ట్రంలో ఏ పార్టీకీ లేదన్నారు. బీఆర్ఎస్ను రాష్ట్ర ఇంటి పార్టీగా ప్రజలు మార్చుకున్నారని పేర్కొన్నారు.
దేశంలో సత్తా చాటనున్న బీఆర్ఎస్..
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దేశమంతంటా సత్తా చాటుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఇటీవల సీఎం కేసీఆర్ బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు రావడాన్ని చూస్తుంటే దేశమంతటా బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏమిటో అర్థమవుతుందన్నారు. కేసీఆర్ దేశ ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు.
బండి.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?
పదో తరగతి పశ్న పత్రాలను లీక్ చేయిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతవా బండి సంజయ్ అని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాదని ముందే తెలుసుకుని చిల్లర రాజకీయాలు చేసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభివాణీదేవి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్యాదవ్, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ విజయనందారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గాదయాకర్రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజ హరినాథ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానంద్రెడ్డి, నాయకులు మద్దుల శ్రీనివాస్రెడ్డి, మల్లికార్జునస్వామి పాల్గొన్నారు.
సేవలని గుర్తించి ఆశీర్వదించండి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
రాష్ర్టానికి సీఎం కేసీఆర్ చేసిన సేవలను గుర్తించి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించిన కేసీఆర్ను మూడో సారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 2014 ముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకుని బీఆర్ఎస్ పార్టీకి మద్దతునివ్వాలన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి, పత్తి, మిర్చి పంటను సాగు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందటే కేసీఆర్ కృషి ఎంతో ఉందన్నారు. పార్టీ కార్యకర్తలందరికి సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారన్నారు.