మేడ్చల్, అక్టోబర్ 2 : ‘సీఎం కేసీఆర్ నిరుపేదల సొంతింటి కల నిజం చేసిండు.. పేదల ఆత్మగౌరవ కోసం ఆయన డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చిండు..’ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ అహ్మద్గూడలో నిర్మిం చిన డబుల్ బెడ్రూం ఇండ్లను మల్కాజ్గిరి నియోజక వర్గంలో 1845, అంబర్పేట నియోజకవర్గానికి 120 మంది లబ్ధిదారులకు కేటాయించారు. సోమవారం లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేసిన మంత్రి మల్లా రెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ర్టాన్ని నెంబర్వన్ స్థానంలో నిలిపా రన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లను అన్ని వసతులతో నిర్మించి ఇచ్చారని చెప్పారు. దళిత బంధు, రైతుబంధు, బీసీ బంధు, కుల వృత్తులకు చేయూత, గృహలక్ష్మి కింద రూ.3లక్షల ఆర్థిక సాయం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజా సంక్షేమానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. గాంధీజీ కలలు కన్నట్టు రాష్ట్రంలో ఉన్న 12,769 గ్రామాల్లో అందంగా తీర్చిదిద్దారన్నారు.
హరితహారం, ప్రకృతి వనాలతో పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు. విద్యా, వైద్యం మెరుగుపడిందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వెయ్యి గురుకులాల్లో 6 లక్షల మంది విద్యార్థులకు చదువుతున్నారని తెలిపారు. గురుకులాల ద్వారా పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు స్థానం లేదని, బీఆర్ఎస్కే ఓటు వేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.
ఇల్లు రాలేదని అధైర్య పడొద్దు..
డబుల్ బెడ్రూం ఇండ్లు రాని వారు అధైర్య పడొద్దని మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ విడుతల వారీగా ఇండ్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. డబుల్బెడ్ రూం ఇండ్లల్లో 10 శాతం ఇండ్లను స్థానికులకు కేటాయించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్రెడ్డి, కమిషనర్ రాజమల్లయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సంబురంగా ఇండ్ల పట్టాల పంపిణీ
అహ్మద్గూడలో డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాల పంపిణీ సంబురంగా జరిగింది. మల్కాజ్గిరి, అంబర్పేట నియోజకవర్గాల నుంచి లబ్ధిదారులు,వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది. అధికారులు లబ్ధిదారులకు ఇబ్బంది కల్గకుండా కౌంటర్లను ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఇండ్లను కేటాయించారు. దూరం ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజన, రవాణా సదుపాయాలు కల్పించారు.