ఘట్కేసర్ రూరల్, నవంబర్ 25 : అభివృద్ధి అడ్రస్ తెలియని కాంగ్రెస్ను ఖతం చేస్తేనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్, అంకుషాపూర్ గ్రామాల్లో శనివారం మంత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి నిరోధకులను సాగనంపాలని లేకపోతే రాష్ట్రం చీకటిమయం అవుతుందన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షించారు. అనంతరం అవుషాపూర్ దర్గా ఉర్సులో పాల్గొని దట్టీలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రోడ్షోలో మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మల్లారెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. రోడ్ షోలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొండల్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు భిక్షపతిగౌడ్, అంకుషాపూర్ సర్పంచ్ జలజ, అవుషాపూర్ ఉప సర్పంచ్ అయిలయ్య యాదవ్, పంచాయతీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసే బీఆర్ఎస్లో చేరికలు : మంత్రి
ఘట్కేసర్ : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి వేలాదిగా బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో బీజేపీ సీనియర్ నాయకుడు నానావత్ కిషన్ నాయక్ వందమంది కార్యకర్తలతో కలిసి మున్సిపల్ చైర్మన్ కొండల్రెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ చింతల రాజశేఖర్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఏమీ చేయలేవని ఆ పార్టీల నాయకులు,కార్యకర్తలు గమనించి సీఎం కేసీఆర్ పాలనను బలపరుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు మందాడి సురేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్, వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి
మేడ్చల్ : మండలంలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సం బపురం వీరస్వామి, సతీశ్గౌడ్, కోమటి రమేశ్, శ్రీకాంత్ చారి, వేణుగౌడ్, నాగరాజుగౌడ్, అశోక్గౌడ్, బాబుచారి, విజయ్గౌడ్, అరుణ్, లోకనాథ్, రాజు, శంకర్, రాజేశ్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదన్నారు. ప్రజలంతా బీఆర్ ఎస్ వైపు ఉంటే వారెలా? గెలుస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దయానంద్యాదవ్, మాజీ సర్పంచ్ జగన్రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రణదీప్రెడ్డి, డైరెక్టర్ కృష్ణయాదవ్,ఉపసర్పంచ్ పెంటమ్మ, నాయకులు సింహాల్యాదవ్, సంతోష్ భాను, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ప్రచారం
మేడ్చల్ మున్సిపాలిటీలో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డితోపాటు పలువురు బీఆర్ ఎస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ర్యాలీలు నిర్వహిస్తూ బీఆర్ఎస్కు ఓటేయాలని ప్రజలను కోరారు. 10 ఏండ్ల పాటు కష్టపడి అభివృద్ధి చేసుకున్న తెలంగాణను కాంగ్రెస్ చేతుల్లో పెడితే ఆగం కావాల్సి ఉంటుందని, మంత్రి మల్లారెడ్డిని గెలిపించుకుంటే మేడ్చల్ మరింత అభివృద్ధి చెందుతుందని ఓటర్లకు వివరించారు.
జవహర్నగర్ నుంచి 150 మంది చేరిక
జవహర్నగర్ : జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో శనివారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 150 మంది నాయకులు కార్పొరేటర్ జిట్టా శ్రీవాణిశ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, మేయర్ మేకల కావ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.