Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పాత నగరంలో మెట్రో రైలు కూత పెట్టనున్నది. ఇప్పటికే మూడు మార్గాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మెట్రో రైలు సేవలను పాతనగరం వరకు విస్తరించేందుకు త్వరగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ట్విట్టర్లో వెల్లడించారు. దీంతో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీతోపాటు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అధికారులు ఎంజీబీఎస్-ఫలక్నుమా మార్గంపై దృష్టిసారించారు. ఈ ప్రాజెక్టు అలైన్మెంట్ ఇప్పటికే ఖరారవడంతో నిర్మాణపరంగా చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు మొదలుపెట్టనున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్, ఎంజీబీఎస్-జేబీఎస్ మార్గాల్లో మెట్రో రైలు సేవలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో ఎంజీబీఎస్-ఫలక్నుమా మెట్రో ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనున్నది.
Hon’ble CM KCR has instructed the Municipal Administration department to take forward the Metro project in Old city of Hyderabad
He also spoke to Chairman of L&T which is the agency executing the Metro Rail Project to expeditiously take up the project and promised all needed…
— KTR (@KTRBRS) July 10, 2023
5.5 కి.మీ. మార్గంలో 4 స్టేషన్లు
మెట్రో కారిడార్-2లో భాగమైన ఎంజీబీఎస్-ఫలక్నుమా మార్గానికి గతంలోనే సర్వే పూర్తయింది. మొత్తం 16 కి.మీ. పొడవైన ఈ మార్గంలో ఇప్పటికే ఎంజీబీఎస్-జేబీఎస్ మార్గం అందుబాటులోకి వచ్చింది. మిగిలిన 5.5 కి.మీ. మార్గంలో ఎంజీబీఎస్ ఇంటర్చేంజ్ నుంచి ఫలక్నుమా వరకు నాలుగు స్టేషన్లను ప్రతిపాదించారు. వీటిని సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్గంజ్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు ఖర్చవుతుందని గతంలో అంచనా వేశారు.