సిటీబ్యూరో : దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్రను షోషిస్తూ, ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే హైదరాబాద్ నగరంపై కేంద్రం వివక్ష చూపుతుందని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. దేశంలోని చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను అప్పణంగా కట్టబెట్టి, నిధులు మంజూరు చేస్తున్న మోదీ సర్కారు.. కోటిన్నర జనాభా నిండిన హైదరాబాద్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు ఆమోదం తెలపాల్సిన కేంద్రం, ప్రతిపాదనల్లో రాష్ట్ర సర్కారు చేసిన తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రాజెక్టును పక్కదారి పట్టిస్తోంది.
దీంతో ఇరు ప్రభుత్వాల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ.. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత పోరాటం నేటికి 508వ రోజుకు చేరుకున్నది. దాదాపు రెండున్నరేళ్లుగా అలుపెరగకుండా, సాగుతున్న ఈ ప్రజా ఉద్యమంతోనైనా కేంద్ర, రాష్ట్ర సర్కారులు జాడ్యాన్ని వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు కేంద్రమైన మహానగరంలో కనీస రవాణా సదుపాయాలు లేక నిత్యం లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునేవారు కరువయ్యారు.
ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధం..
రాష్ర్టానికి రావాల్సిన మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టులతోపాటు, నగరానికి దక్కాల్సిన ఎన్నో ప్రాజెక్టులను కేంద్రం తొక్కి పెడుతొందని మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆరోపించింది. సమితి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంది. 2600 మంది క్రియాశీలక సభ్యులతో కూడిన ఈ సమితి సోషల్ మీడియాలో చురుకైనా పాత్రను పోషిస్తోంది. మెట్రో ఫేజ్-2 విషయంలో నగరానికి జరుగుతున్న నష్టాన్ని, ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వాన్ని ఎండగడుతూనే ఉంది.
ఢిల్లీ పెద్దలను కదిలించేలా పోస్టులు, డిజిటల్ నిరసనలతో రాష్ట్ర నేతలను ప్రజల ముందు ఎండగడుతూనే ఉంది. అయినా కూడా ఇరు ప్రభుత్వాల్లో కదలిక లేనట్లుగా వ్యవహరిస్తున్నాయని సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు ప్రతిపాదనలతో రాష్ట్ర సర్కారు, పరిశీలనతో కేంద్రం చేసే కాలయాపనను సహించేది లేదని, అవసరమైతే ప్రాథమిక హక్కులను పరిరక్షించుకునేందుకు ప్రత్యక్ష ఉద్యమ సన్నాహాలూ చేస్తామని హెచ్చరిస్తున్నారు.