మియాపూర్, ఏప్రిల్ 20 : ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. వైద్యశాలలకే పరిమితం కాకుండా ప్రజల చెంతకు వైద్య సేవలను తీసుకెళుతూ క్షేత్రస్థాయికి సేవలను విస్తరిస్తున్నదన్నారు. మేడ్చల్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ హిల్స్లో బుధవారం ఆరోగ్య మేళాను నిర్వహించారు.
కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్రావులతో కలిసి విప్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ఈ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్గా ఎప్పటికప్పుడు ప్రజలను వైద్య ఆరోగ్య పరంగా చైతన్య పరుస్తూ తగు సలహాల ద్వారా అవగాహనను కల్పిస్తుండటం అభినందనీయమన్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకే వైద్య సేవలను తీసుకువచ్చి అందిస్తుండటం గొప్ప విషయమని తెలిపారు. ఈ తరహా విలువైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని విప్ గాంధీ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చందర్, డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, రాఘనాథ్స్వామి, డాక్టర్ మధుసూదన్రెడ్డి, డాక్టర్ సంధ్య, ముస్తఫా, పార్టీ నేతలు పాల్గొన్నారు.
ప్రజలలో అవగాహనతో పాటు నిర్మూలనకై జాతీయ ఆరోగ్య మిషన్, కుటుంబ సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార బ్యానర్ను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి విప్ గాంధీ బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, జనార్దన్, అనీల్ తదితరులు పాల్గొన్నారు.
రక్షణ విభాగంలో సీసీల పాత్ర కీలకం
కొండాపూర్, ఏప్రిల్ 20 : రక్షణ విభాగంలో సీసీ కెమెరాలు ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్నగర్ కాలనీలో రూ. 4.70లక్షలతో ఏర్పాటు చేసిన 34 సీసీ కెమెరాలను ఆయన మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా భద్రతలో పోలీసులకు సీసీ కెమెరాలు ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాయన్నారు.
కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారన్నారు. అసోసియేషన్లు, కాలనీ వాసులు కలిసి కట్టుగా ముందుకు వచ్చి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ఎస్ఐ రవి కిరణ్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, రమేశ్, సాజీద్, రూపారెడ్డి, జంగంగౌడ్, తాడెం మహేందర్, తిరుపతి, రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.